పుట:Naa Kalam - Naa Galam.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సాంబమూర్తి, మద్రాసు మేయర్‌గా పనిచేసిన సామి వెంకటాచలం చెట్టి, "ప్రజాపత్రిక" మేనేజింగ్‌ డైరెక్టర్‌ కర్లపాటి అప్పారావు.

వారి ప్రశ్నలకు నేను సముచిత సమాధానాలు చెప్పిన తరువాత "మీరు ఇది వరకు రాసిన వ్యాసం ఏదైనా వుంటే చూపించవలసిందిగా" అడిగారు. నేను "మద్రాసు వలదన్న తెలుగు మంత్రి నోటికి తాళం" అన్న హెడ్డింగ్‌తో వున్న "ప్రతిభ" సంచికను చూపించాను. ఆ హెడ్డింగ్‌ వారికి చాలా నచ్చింది! అప్పటి మద్రాసుతో కూడిన ఆంధ్రరాష్ట్రం కావాలని "ఆంధ్రకేసరి" పట్టుదల కాగా, మద్రాసు మంత్రివర్గంలోని తెలుగుమంత్రులు మద్రాసు లేకుండానే ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించాలని, అలా అయితే "ఆంధ్రరాష్ట్రం" త్వరగా వస్తుందని వాదించసాగారు. అందువల్ల, తమ వాదానికి అనుకూలమైన ఆ హెడ్డింగ్‌ ఆ ఇంటర్‌ వ్యూ కమిటీకి నచ్చి, నన్ను వెంటనే వెళ్లి "ప్రజాపత్రిక"లో చేరమన్నారు.

ఆ పత్రికకు ప్రకాశం గారు చీఫ్‌ ఎడిటర్‌, ఆయన అనుంగు శిష్యుడు, ప్రముఖ రచయిత శ్రీ క్రొవ్విడి లింగరాజు అసోసియేట్‌ ఎడిటర్‌. నేను ఒక సహాయ సంపాదకుణ్ణి. ఆ సంపాదకవర్గంలో ఇద్దరు, ముగ్గురు మినహాయిస్తే, తక్కిన వారందరు పత్రికా రచనకు కొత్తవారే. నేను అప్పటికే ఏడేళ్లుగా పాత్రికేయుడుగా, "వాహిని"లో ఉపసంపాదకుడుగా, "ప్రతిభ"లో సంపాదకుడుగా పనిచేసి వుండడం వల్ల ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చే వార్తలన్నింటికి నన్ను ఎడిటర్‌గా నియమించారు.

ఆంధ్రకేసరికి కార్యదర్శిని!

నా జీవితంలో మరపురాని, శాశ్వతంగా గుర్తుండిపోయే సంఘటన అప్పుడే జరిగింది. ఒక రోజున "ప్రజాపత్రిక" ఆఫీసుకు వచ్చిన పంతులు గారు నన్ను పిలిపించారు. ఏమై వుంటుంది? నాకిచ్చిన ఆంధ్రప్రాంత వార్తల