పుట:Naa Kalam - Naa Galam.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విలువ, గౌరవం పెరగాలి కాని, తగ్గిపోవాలా? అది పురుషాధిక్యతా మనస్తత్వం కాదా? అంతకాలం "ఏమండీ!" అని పిలిచి, మూడు ముళ్లుపడగానే భార్యకు బానిసత్వం, భర్తకు "బాస్‌ తత్వం" రావాలా? ఈ ఆలోచనే ఆమెను "ఏమండీ!" అని పిలిపించింది!

అయితే, నా "పిలుపు" కుటుంబంలోని పెద్దలకు కొంత ఇబ్బందే కలిగించింది. కవయిత్రి అయిన మా అమ్మగారు కూడా తన కుమారులమైన మమ్మల్ని "ఏరా!" అని పిలిచేది కాదు. పేరు పెట్టి పిలిచేదే కాని, "ఒరే", "ఏరా" అనేది కాదు. అప్పటిలో కోడళ్లను కొందరు అత్తలు చాలా చులకనగా, కేవలం పనిమనుషులుగా, హీనంగా చూచేవారు. ఒసే! ఏమే! అని పిలిచేవారు. మా అమ్మగారు కోడళ్లను ఏనాడూ "ఏమే" అని పిలిచేది కాదు. ఏకవచనంతో "ఏమిటమ్మా", "నువ్వు" అని మాత్రమే సంబోధించేది.

ఆమె ఒక రోజు నా వద్దకు వచ్చి "నువ్వు కృష్ణ కుమారిని "ఏమండీ" అని పిలవడం కొందరికి ఇబ్బందిగా వుంది. తక్కిన వారి మాదిరిగా నువ్వు "ఏమే", "ఒసే" అని పిలవనక్కరలేదు కాని, "నువ్వు" అని వ్యవహరిస్తే బాగుంటుంది." అని అనునయంగా, మృదువుగా చెప్పింది.

నిజమే! "తక్కిన వారు "ఒసే" అని పిలుస్తుంటే, కుటుంబరావు చూడండి, భార్యను "ఏమండీ" అని పిలుస్తాడు. మీరేమో మమ్మల్ని "ఒసే, అసే" అంటే మాకేమి బాగుంటుంది?" అని కొందరు భార్యలు భర్తలపై ఒత్తి తీసుకువచ్చారు! మొత్తం మీద అప్పటిలో కొందరు భర్తలు, భార్యలను "ఒసే" అని పిలవడం మానివేసినట్టు తరువాత దాఖలాలు కనిపించాయి.

ఈ విషయంలో ఆ చిన్ననాటి డిబేటింగ్‌ సొసైటిలో స్వరూపరాణి కన్నీరు ఇంత కథకు కారణమైంది.