అనువదిస్తున్నారు. పండిట్ నెహ్రూ తన ఉపన్యాస క్రమంలో "కోల్డ్ వార్" అనే "ప్రచ్ఛన్న యుద్ధం" కాలంలో ఎక్కువగా వాడుకలో వున్న పదాన్ని వుపయోగించారు. దాన్ని శ్రీ సంజీవరెడ్డి "శీతల యుద్ధం" అని యథాతథంగా తర్జుమా చేశారు. అప్పటికి నేను "ప్రజాసేవ" అనే తెలుగు వారపత్రికకు ఎడిటర్ను. వేదికకు ముందు వుండే "ప్రెస్ గ్యాలరీ" లో కూర్చున్నాను. శ్రీ సంజీవరెడ్డి "శీతల యుద్ధం" అనగానే నేను వెంటనే "ప్రచ్ఛన్న యుద్ధం" అని బిగ్గరగా కేక పెట్టాను!
ఎందువల్ల నంటే, దాదాపు లక్ష మంది ప్రధాని నెహ్రూ ఉపన్యాసం వింటున్నారు. తెలుగు పత్రికలన్నీ కూడాా "కోల్డ్వార్" అన్నమాటకు "ప్రచ్ఛన్న యుద్ధం", అంటే ప్రత్యక్షంగా ఆయుధాలతోకాక, మాటలతో, వాదోపవాదాలతో పరోక్షంగా రెండు పక్షాల మధ్య జరిగే "ముసుగులో గుద్దులాట" అని చెప్పవచ్చు.
నేను ఎప్పుడైతే, "ప్రచ్ఛన్న యుద్ధం" అని కేక పెట్టానో వెంటనే ప్రధాని నెహ్రూ, శ్రీ సంజీవరెడ్డి నా వంకకు చూశారు! శ్రీ సంజీవరెడ్డి గారు కొంచెం చిన్న బుచ్చుకున్నట్టు కనిపించింది!
సరే! తిరిగి కాలచక్రాన్ని వెనక్కితిప్పితే, ఒకసారి హైస్కూలులో డిబేటింగ్ సొసైటీలో "స్త్రీలకు విద్య అవసరమా? కాదా?" అన్న విషయంపై చర్చ జరుగుతున్నది. ముందు స్వరూప రాణి స్త్రీలకు విద్య అత్యవసరమని గట్టిగా వాదించింది.
తరువాత నేను లేచి, స్త్రీలకు విద్య అనవసరమని, ఎందువల్లనంటే, ఎంత చదివినా, స్త్రీలు ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుని, అత్తింటికి వెళ్లి వంటచేస్తూ, అంట్లు తోమవలసిందే గదా! అని ఎద్దేవాగా మాట్లాను! నా మాటకు విద్యార్థులు చప్పట్లు కొట్టారు! విద్యార్ధినులు "అలా అన్నావేమిటి?" అన్నట్టు నా వంక బాధగా చూశారు!