6
భాగవతము
అష్టాదశపురాణములలో భాగవత మొకటిగాఁ బేర్కొనఁ బడినది. విష్ణుభాగవత మష్టాదశపురాణములలోనిది గా దనియు బోపదేవుఁడు దానిని గల్పించె ననియుఁ గొంద ఱందురు. పదుమూఁడవశతాబ్దిలోఁ బ్రఖ్యాతాంధ్రకవీశ్వరుఁడుగా నుండిన పాల్కురికిసోమనాథుఁడు విష్ణుభాగవతము కల్పిత మన్నాఁడు. ఎవ్వ రేమన్నను విష్ణుభాగవతము మిక్కిలి ప్రఖ్యాతిని గడించినది. అష్టాదశపురాణములలోను దాని కున్నంత గౌరవము మఱి యేపురాణమునకు లేదు. సంస్కృతమున దాదాపుగా నలువదివ్యాఖ్యానములు దానికున్నవి. సర్వభాషలలోను నది పరివర్తిత మయినది. తెలుఁగుపరివర్తనములఁ గూర్చి నే నిక్కడ గొంత పేర్కొందును.
పోతన-సింగన
పదునైదవశతాబ్దిపూర్వార్ధమున భాగవతము నిర్వురుకవీశ్వరులు తెలిఁగించిరి. అం దొకఁడు బమ్మెర పోతరాజుగారు. ఈయన కృతి జగత్ప్రసిద్ధమేకదా! రెండవవాఁడు మడికి సింగనార్యుఁడు. ఈతఁడు దశమస్కంధముమాత్రమే ద్విపదకృతిగాఁ దెనిఁగించినాఁడు. అది తంజావూరుపుస్తకశాలలో నున్నది. అది యింకను నాంధ్రలోకమునఁ బ్రకటితము గాకుండుట శోచనీయము.
పోతరాజుగారిభాగవతము సమగ్రముగా లభించిన ట్లీనడుమ నొకప్రవాదము పుట్టినది. ఆంధ్రసాహిత్యపరిషత్పుస్తకభాండాగారమున కది చేరినదఁట! కాని యాపుస్తకభాండాగారమున నది కానరాదు. అట్టిది దొరకియుండ దనుకొనెదను. ఏల యనఁగా పోతరాజుగారికిఁ దర్వాత నించుమించుగా నలువదియేcబది యేండ్లకె యాయన గ్రంథమందలి