ఓం నమో వేంకటేశాయ
కృతజ్ఞతాంజలి
విద్వాన్, డాక్టర్ పమిడికాల్వచెంచుసుబ్బయ్య
సమన్వయ కర్త,
శ్రీమాన్ వేటూరిప్రభాకరశాస్త్రి వాఙ్మయపీఠము,
'శ్వేత' భవనము, తి.తి. దేవస్థానములు, తిరుపతి.
తిరుమల తిరుపతి దేవస్థానంవారి హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి పదవినుండి స్వచ్ఛందంగా నా అంతట నేనే వైదొలగినా - నాపై విశ్వాసాభిమానా లుంచి, నన్ను శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రివాఙ్మయపీఠానికి సమన్వయకర్తగా మరియు మాతృశ్రీతరిగొండవెంగమాంబ వాఙ్మయప్రాజెక్టుకు ఇంఛార్జి సమన్వయకర్తగా నియమించిన పాలకమండలి అధ్యక్షులు గౌరవశ్రీ భూమన కరుణాకరరెడ్డిగారికీ, గౌరవశ్రీ పాలకమండలి సభ్యులకూ, కార్యనిర్వహణాధికారి మాన్యశ్రీ కె.వి. రమణాచారి, ఐ.ఎ.ఎస్. గారికీ తదితర ఉన్నతాధికారవర్గానికీ, ఈ నియామకంలో తమ సంపూర్ణసహకారాన్ని అందించిన 'శ్వేత' సంచాలకులు మాన్యశ్రీ భూమన్గారికీ హార్దకృతజ్ఞతాంజలులు.
శ్రీవేటూరి ప్రభాకరశాస్త్రిగారి “సింహావలోకనం" ఒకప్పుడు విద్వాన్ కోర్సుకు పాఠ్యాంశంగా ఉండేది. బోధన సందర్భంగా ఆ పుస్తకాన్ని చదివే భాగ్యం చేకూరింది. అప్పుడు అనిపించింది - శ్రీవేటూరివారి పాండితీగరిమ, విమర్శన నైపుణ్యం, రచనలో వారు పాటించే నిబద్ధత, గ్రాంథికభాషపై, ప్రాచీన సాహిత్యంపై వారికున్న సునిశిత పరిశోధన హృదయం, అనితర సాధ్యమైన వని. ఆనాడే వారిపై ఎనలేని గౌరవం ఏర్పడింది.
ఏ జన్మాంతరబంధమో - ఎందరో ప్రత్యక్షశిష్యు లున్నా - పరోక్ష శిష్యుణ్ణైన నాకు శ్రీశాస్త్రిగారి వాఙ్మయానికి సేవ చేసే భాగ్యం - శ్రీనివాసుని కృపాకటాక్షంతో లభించింది. మొదట్నుంచీ ప్రాచీన సాహిత్యంపై మక్కువ ఎక్కువున్న నాకు ఈ సేవ లభించడం మహాదృష్టం!
ప్రస్తుతం ఇప్పు డిప్పడే ఈ వాఙ్మయపీఠం రూపురేఖలుదిద్దుకొంటూంది. శ్రీశాస్త్రిగారి సాహిత్యం - వ్రాతప్రతులూ ఇంకా చేరవలసినవి చాలా ఉన్నాయి. వాటి ఆధారంగా అనేక కోణాల్లో పరిశోధనలు జరిగి, విలువైన ప్రాచీన సంపద ఆంధ్రసాహితీ ప్రియులకు అందించాల్సిన బాధ్యత పీఠంపై ఉన్నది. ఈ దిశగా కృషి జరుగుచున్నది.