పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీఁగడ తఱకలు

131


దీని ప్రతి వ్రాయించుకొని సవ్యాఖ్యానముగాఁ బ్రకటింప నుత్సాహపడితిని గాని పెక్కుచోట్ల శ్లేషచమత్కృతి దుర్గ్రహముగా నుండుటచే నింతదాఁక దానిని ముగింపఁజాలకుంటిని. కుదిరినంత వఱకయిన లఘుటీక గూర్చి ప్రకటింపవలెను. దీనిని ప్రకటించుటలో కృష్ణాధ్వరిమీఁది గౌరవముగాని, శ్లేషకవితమీఁది యాదరముగాని, యముద్రితగ్రంథప్రకటనముమీఁది యౌత్సుక్యముగాని కారణములు గావు. మహనీయుc డయిన రఘునాథరాయల మీఁది యాదరమే యేతద్గ్రంథ ప్రకటనమునకు న న్నుత్సాహపఱచు చున్నది.

ఈతనిగ్రంథములోని రచనాచమత్కారములు గొన్ని చూపుదును. కథారంభపద్యము.

"బలభద్రస్థితి వైరివర్గము నడం పన్ సత్యభామాదులు
 జ్జ్వలసామ్రాజ్యభరార్హతం దెలువఁగా శౌర్యాఖ్యచే మాగధా
 దులు దీర్ణానతవర్ణతం జెలఁగ సం తోషశ్రితశ్రీకుఁడౌ
 నలభూమీపతి గారవించె మహినిన్ న్యాయంబునన్ రుక్మిణిస్"
                                                 -నైషధపారిజాతీయము

ఇందు నాల్గవ చరణమున రెండర్థములకు సరిపడునట్లు నల-అల, 'న్యా' యతి కలదు. బలభద్ర, సత్యభామాదులు, శౌర్యాఖ్య, మాగధాదులు దీర్ణానతవర్ణత, ఔనలభూమీపతి, మహినిన్ రుక్మిణిన్-పదములు రెండర్థములకుఁ గుదురుపడునవి.

“ఆకార నున్నమణిగిరి
 రాకన్నెల చూచు సొంపు రా భీమజన
 వ్యాకుల నప్పురిఁ బుణ్య
 శ్లోకుఁడు గనె భావికుశలసూచిశకునఁడై."