పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీఁగడ తఱకలు

125


నుండుటయే. తంజావూరిలో చెవ్వప్ప నాయకాదులు, మధురలో నాగమనాయకాదులు, పుదుక్కోటలో కోటవారు, రాజ్యము లేలుచు నాంధ్రదేశమునుండి కవులను, గాయకులను, గాయనులను, అభినేత్రులను, శిల్పకారులను, వ్రాయసగాండ్రను, నింకను రాజ్యాంగమునకు వలసిన విద్యావ్యవహార, వినోద, ముఖ్యతంత్రములవారి నెల్లను వెంట గొనిపోయిరి. అరవదేశమున విఖ్యాతులుగా నున్న విద్వాంసులను, గాయకులను, వ్యవహారదక్షులను సంపూర్ణముగఁ దమకు సహాయపఱచుకొని సర్వ సామరస్యముతో రాజ్య రక్షణము గావించిరి.

తొలుత చాళుక్యరాజ్యమునను, దర్వాత కాకతీయరాజ్యమునను సంప్రదాయపరంపరాగతము లగుచుండు గ్రంథసంచయమునుగూడఁ దమతో వా రాయారాజ్యములకుఁ గొనిపోయిరి. అట్లు కొనిపోయిన గ్రంథసంచయము తంజావూర మహనీయముగఁ బెంపొందినది. ద్రవిడదేశమున నెలకొన్న నాయకరాజులు తమపాలనతంత్రమును దమపూర్వులు కృష్ణదేవరాయాదులు నిర్వహించినతీరుననే నిర్వహించిరి. శ్రీకృష్ణదేవరాయాదులు తమ పూర్వపుసంగమవంశపురాజుల తీరును, వారు తమపూర్వపుఁ గాకతీయుల తీరును, వారు తమ పూర్వపుఁ జాళుక్యులతీరును ననువర్తించి రాజ్యతంత్రముల సాగించిరి. విద్యానగరమున నుండి తంజావూరికిఁ జేరిన గ్రంథములలో నట్టి రాజ్యపరంపరాయాతము లనేకము లున్నవి. చాళుక్యుల యభిలషితార్థచింతామణి, సంగీత చూడామణులు సామ్రాజ్యలక్ష్మీపీఠికాతంత్రము మొదలగుగ్రంథము లీ రాజ్యపారంపర్య సంప్రదాయములను వెల్లడించునవిగా గుర్తింప నగుచున్నవి ప్రధానముగఁ బై మూడు గ్రంథములు శ్రీకృష్ణరాయల రాజ్యనీతి, రాజ్యతంత్రవిధానములకును, నట్లే తంజావూరిరాజుల రాజ్యతంత్రరాజ్యనీతి విధానములకును సరిపోలునవిగా నిరూపణ కెక్కుచున్నవి. రాయ వాచకమునను, నాముక్తమాల్యదలోను నున్న రాజ్యనీతివిషయములు చాల