మీఁగడ తఱకలు
107
మ|| రమణీయంబుగ శాలివాహశకవర్షంబుల్ గతంబై సహ
స్రము నేనూఱను నాఱునై వెలయఁగాఁ బ్రౌఢిం దెనింగించి రౌ
ర మహిం దిమ్మయ వేంకటాద్రివిభుపేరన్ వేడ్కఁ గామందకీ
యము వేంకటరామకృష్ణులు స్వభాన్వబ్దంబునన్ రూఢిగాన్,
వీనిఁబట్టి చూడఁగాఁ బాండురంగమాహాత్మ్యరచనాకాలము క్రీ. 1565 ఇంచుమించుగా నగు నని యేర్పడుచున్నది. అనఁగాఁ దెనాలి రామలింగకవి యించుమించుగా క్రీ.1525 ఉద్భటచరిత్రమును, మఱి ముప్పది యేండ్లకుఁ బాండురంగ మాహాత్మ్యమును రచించి యుండునని చెప్పనొప్పుచున్నది. మనకవితమ్ముఁ డగునన్నయకవి సుదక్షిణా పరిణయరచనాకాలముకూడ నిందుకు సరివచ్చుచున్నది. మఱి పెక్కుమార్గములచేఁ గూడ మన కవివర్యుని కాలమును నిర్ణయింపవచ్చును గాని యామార్గములు కొంత డొంకతిరుగుడుగా నుండుటచేతను, నిప్పుడు చెప్పినకాలమునకే చేరునవిగా నుండుటచేతను విడనాడినాఁడను.
కవిస్తుతులు
నేఁ జూచినంతవఱకుఁ గవిస్తుతులలో 'రామలింగకవి' యన్న పేరే కానవచ్చినది. నడుమఁ దెచ్చి పెట్టుకొన్న రామకృష్ణనామము ప్రాచీనకాలమునఁ బ్రఖ్యాతము కాలేదు కాఁబోలును! పాండురంగ మాహాత్మ్య ప్రౌఢిమ ప్రఖ్యాత మైనతర్వాత రామకృష్ణనామముగూడ రహి కెక్కినది.
ఉ|| రంగుగఁ బాండురంగని తెఱం గలరంగ రచించి వేడ్క మీ
ఱంగ ఛలోక్తులన్ నృపుఁ గరంగ నొనర్పుహొఱంగు నింగి ము
ట్టంగ మెలంగు నేరుపుఁ గడంగి చెలంగునభంగసద్యశో
లింగుని రామలింగ శశలింగకళానిధినిన్ గణించెదన్
(నాగ్నజిత్తీపరిణయము-వల్లూరి నరసింహకవి)