"శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే"
నా మాట
28. 01. 2008
కె.వి, రమణాఛారి, ఐ.ఏ.ఎస్,
కార్యనిర్వహణాధికారి,
తి.తి.దేవస్థానములు,
తిరుపతి.
తిరుమల తిరుపతి దేవస్థానములవారు చేపట్టిన ప్రజాహిత కార్యక్రమాలు ప్రజల్లో ఎంతో భక్తిధార్మిక చైతన్యాన్నికల్గిస్తున్నాయి. శ్రీవారి యందు అచంచల భక్తినీ, ప్రగాఢ విశ్వాసాన్నీ దృఢతరం చేస్తున్నాయి. వీటికితోడూ ప్రాచీనసాహిత్యంలో ఆణిముత్యాలైన రామాయణ భారత భాగవతాదిగ్రంథాలను సరళసులభవివరణాత్మకంగా ప్రజలకు అందిస్తున్నారు.
ఏ దేశంలో ఉత్తమసాహిత్యం విశేషంగా వ్యాప్తిజెంది, ప్రజా హృదయాల్లో చెరగని ముద్ర వేస్తుందో, ఆ దేశంలో ధార్మికసంస్కృతి, నాగరికత, జ్ఞానం, భక్తి, ఆధ్యాత్మికచింతన, సౌభ్రాత్రం, సౌశీల్యం, సుఖశాంతులూ వర్ధిల్లుతాయి. సంసారం సంస్కారంతో రాణిస్తుంది.
ఈ దిశలో భాగంగా దేవస్థానంవారు "శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రి వాజ్మయపీఠాన్ని "శ్వేత" లో స్థాపించారు. ఈ పీఠం ద్వారా శ్రీశాస్త్రి గారి రచనలనూ, పరిష్కరణలనూ, సాహిత్యజ్ఞులకు సన్నిహితం చేయడమేకాకుండా - ఉత్తమపరిశోధనలూ జరిపించి, అనేక నూతనాంశాలు - సమాజశ్రేయోదాయకమైనవి వెల్వరించా లనీ ఆశిస్తున్నాము.