పీఠిక
ఉ. తల్లి సమస్తభాషలకు దైవతభాషయ, దేశభాషలన్
పిల్లలలోన నాంధ్రి యనుపేరిటి దెంతయు ముద్దులాఁడిరా
ట్తల్లజు లాదరించిన కతంబునఁ బల్కులఁ గుల్కు మీఱి య
ల్లల్లనఁ దక్కు, నక్క సెలియండ్రకు నెక్కుడు కీర్తి చేకొనెన్.
కం. జిలిబిలి పలుకుల బలు ము
ద్దులు గులికెడు తెలుగుబాసతో సరియగునే
తెలిసియుఁ దెలియక వీనుల
నలయించెడు వెఱ్ఱిమొఱ్ఱి యఱమొఱ బాసల్.
సంస్కృతమని పేర్కొనఁబడిన యార్యభాషయే తొలుదొలుత భరతఖండమునఁ బెంపొందిన వాఙ్మయము. చాలవఱకు దానివలననే తర్వాతఁ బ్రాకృతములును దేశభాషలును బెంపొందినవి. దక్షిణ హిందూదేశమునఁగల దేశభాషలలో నాంధ్ర, ద్రవిడ, కర్ణాట భాషలు ప్రధానమయినవి. ఇందు ద్రవిడ, కర్ణాటభాష లాంధ్రముకంటెఁ
బ్రాచీనములని యూహింపఁబడుచున్నవి. ఆ రెండు భాషలలోను గ్రంథములు రచింపఁబడుచు వచ్చిన కొంతకాలమునకుఁగాని యాంధ్రభాషలో గ్రంథరచన ముపక్రమింపఁబడినట్టు చూపట్టదు. గ్రంథరచనముపక్రమింపఁబడుటకుఁ బూర్వమాంధ్రభాష స్థితి యెట్టిదో మన కించుకయుఁ దెలియరాదు. ఇటీవల నాంధ్రకవితకుఁ బుట్టిల్లనఁ జెల్లిన వేంగీదేశమునం దానాఁడు జన్మించిన నాగవర్మ కర్ణాటభాషకు ఛందోంబుధి యను ఛందశ్శాస్త్ర గ్రంథమును రచించె; కాని యాంధ్రభాష యుబుసైన నెత్తఁడయ్యె. నాఁటి కీ భాషకుఁ దిన్ననిరూ