పుట:MaharshulaCharitraluVol6.djvu/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆరణ్యకమహర్షి

5


విరూపను గావించెను. పిదప జ్యేష్ఠకృష్ణాష్టమినాడు రావణుడు వచ్చి సీతను గొనిపోవుచుండ నామె యింటలేని రామునికై రామ రామ యని యేడ్చెను. ఆ యేడుపువిని జటాయువు రావణుని కడ్డువెళ్ళి యాతడు రెక్కలు నరుక గ్రిందబడిపోయెను. సంపాతి వానరులకు సీతజాడ చెప్పెను. మార్గశిరశుద్ధ యేకాదశినాడు హనుమంతుడు మహేంద్ర పర్వతమునుండి యెగిరి రాత్రికి లంకనుజేరి తెల్లవారుకట్ట సీతను గని సంచార ముడిగి విశ్రమించి, ద్వాదశినాడు శింశుపావృక్షము నెక్కినాటి రాత్రి చేతులు జోడించి సీతకు నమస్కరించి నమ్మకము కలుగునట్లు పలికి త్రయోదశినాడు అక్షకుమారుడు మున్నగు రాక్షసుల జంపి చతుర్దశినాడు ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రమున బద్ధుడైనట్లు నటించెను. రాక్షసు లానందించి యాతనితోకకు నూనెగుడ్డలుచుట్టి యంటింప దానితో నాతడు లంకాదహనము కావించెను. పూర్ణిమనాటికి హనుమంతుడు తిరిగి మహేంద్రగిరికివచ్చి వానరులతో గూడి యైదు దినములు నడచి యారవ దినమున మధువనము జొచ్చియందు మధువు గ్రోలి చెట్ల జెల్లాచెదరుచేసి పయనించి యేడవ దినమున రామునిజేరి యానవా లొసంగెను.

శ్రీరాముడు ఉత్తరఫల్గునీనక్షత్రయుక్తమగు అష్టమినాడు బయలుదేరి యేడుదినములు సముద్రతీరమున స్కందావారముననుండి పుష్యశుద్ధప్రతిపత్తు మొదలు తదియ వరకు సేనలు నడపి సముద్రము జేరి చవితినాడు విభీషణునకు శరణొసగి పంచమినాడు మొదలు నాలుగు దినములు ప్రాయోపవేశము గావించెను. సముద్రుడు వర మొసగ దశమినాడు సేతువును గట్ట నారంభించి త్రయోదశికి బూర్తిచేసి చతుర్దశినాడు సైన్యమును సువేలాద్రి జేర్చెను. పూర్ణిమమొదలు విదియవరకు రాముడు సపరివారముగా సముద్రము దాటి దశమివరకు నెనిమిది దినములు లంకావరొధము గావించెను. ఏకాదశినాడు శుకసారణులరాకయు ద్వాదశినాడు సైన్యసమీకరణము త్రయోదశి మొదలు అమావాస్య వరకు మూడు దినములు సైన్యము లెక్కించుటజరుగ నుత్సాహము నందెను. మాఘశుద్ధ ప్రతిపత్తునాడు అంగద రాయబారము, విదియ మొదలు అష్టమి వరకు యుద్ధము, మాఘశుద్ధనవమి