పుట:Maharshula-Charitralu.firstpart.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్టావక్ర మహర్షి

49


స్వర్ణ సౌధము నష్టావక్రునకు విడిదిగా నిచ్చి రంభాద్యప్సరోభామల నాతనికిఁ బరిచారికలఁగా నేర్పఱిచెను. వా రనుదినమును నృత్య గీత వాద్యములచే నాతని నానందింపఁ జేయు చుండిరి. కాని, యష్టవక్రుఁ డేమాత్రమును వారిమోహ వాగురలకు లోనుగాక యొక్క వత్సర మలకాపురమునఁ గడపెను. కుబేరుఁడు నాతనిఁ బలువిధముల గీర్తించి వీడుకొలిపెను. అంత నష్టావక్రుడు హిమాలయ సమీపమునకుఁ బోయి యటఁ గాన నగు మహర్షులకు నమస్కరించుచు నానందతన్మయుఁడై హిమశైలతట మధిష్టించెను. అందుఁ బార్వతీ పరమేశ్వరులకుఁ బ్రమథగణములకుఁ బలువిధముల బూజ లర్పించి సర్వేశ్వరస్తోత్రముతోఁ గొంత కాల మటఁ గడపెను. పిమ్మట నింకను నుత్తరమున కేఁగ వదాన్యుఁడు చెప్పిన కడిమిలేమ్రాకుల యడవి తోఁచెను. అందాతఁడు ప్రవేశింపఁగానే దివ్యసుందర స్త్రీవిలసితము లగు హేమసౌధములు గోచరించెను. వానిని జూచి యాశ్చర్యమందుచు నష్టావక్రుఁడు లోనికిఁ బోయి యట గానవచ్చిన నారీజనానీకమునకు వశుఁడు గాక వారల రాజ్ఞిఁ జూపుమనెను. అంత వారు భవనాంతర్భాగమున కాతని గొనిపోయి దివ్య దీధితితో నొప్పు నొక మదవతిని జూపిరి. ఆమె యనంతవిలాస హాసములతో నష్టావక్రు నాహ్వానించి యర్ఘ్యపాద్యాదులొసఁగి యాదరించెను. పిమ్మట రాత్రిపడఁగా నాతని నిష్టమృష్టాన్నముల సంతృప్తునిఁ జేసి యాతఁడు నిద్రించుతఱి నాతనిశయ్యఁ జేరి యామె యతనిఁ గవయఁగోరెను. తా నస్ఖలిత బ్రహ్మచారి ననియుఁ బరసతి నపేక్షించుట పాపహేతువనియుఁ జెప్పి నాఁటి కాతఁడు తప్పించుకొనెను. కాని మఱునాఁడు మరల నాతని కామె యభ్యంగనాదు లొనర్చి షడ్రసోపేతముగా నధి కాదరమున విందుచేసెను. మమకారరహితుఁడై యాతఁ డన్నిటి కంగీకరించెను. కాని, యా రాత్రి తిరిగి యాతనిఁ దన్నుఁ గవయ వలయునని యామె బలవంతము చేసెను. ఆమె యెన్ని చెప్పివను వినక యాతఁడు స్త్రీలకు స్వాతంత్ర్యము లే దనియు బాల్యమునఁ