పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

74

మహాపురుషుల జీవితములు

లయమును గట్టింపవలయునని సంకల్పించుకొనియె. ఇట్లమెరికా ఖండములో నతఁడు వేదాంతమునుగూర్చి రెండు సంవత్సరములు గొంతపనిచేసి స్వదేశమును జూడవలయునని బయలుదేరి ముందుగా సింహళద్వీపమునకు రాజధానియైన కొలంబో నగరమున దిగెను. ఆనగరమున నతఁడు దిగినాడనువార్త వినినది మొదలు మన దేశస్థులు జగత్ప్రసిద్ధిగాంచిన యామహాత్ముని దమతమ పట్టణముల కెప్పుడు రావించి వాని వాక్యామృతము నెప్పుడు గ్రోలుదుమాయని యువ్విళ్ళూరుచు వానిని గౌరవపూర్వకముగాఁ బిలిచిరి. వివేకానందస్వామి కొలంబోనుంచి బయలుదేరి పూర్వము తనకు సహాయము చేసి తన్నమెరికాఖండమునకు బంపిన చెన్నపురివాసులయెడ గృతజ్ఞుండయి వారిని జూడవచ్చెను. ఆసమయమున జెన్నపురివాసు లాయనకుఁ గావించిన మహాగౌరవముఁ జూచితీరవలయును; కాని వర్ణింప నలవికాదు. అతఁ డచ్చటఁ గొన్ని యుపన్యాసములనిచ్చి యనంతరము కలకత్తానగరమునకుఁ బోయెను. తమదేశములో నున్నంతకాలమాయన ప్రజ్ఞల నించుకయు నెఱుంగని బంగాళాదేశస్థులు విదేశములలో మిక్కిలి పేరువడసిన యాసన్యాసిని మిక్కిలి గౌరవించి వాని యుపన్యాసములవలన లాభము పొందిరి. పిమ్మట వివేకానందుఁడు బొంబాయి, అలహాబాదు మొదలగు ప్రదేశములకుఁ బోయి దాదాపుగ హిందూదేశ మంతయుఁ దిరిగి వేదాంతమత మందఱ కుపదేశించి యనంతర మింగ్లాండు దేశమునకుఁ బోయెను.

అక్కడ చతుర్వేదముల సారమును జూచిన వాఁడును శాస్త్రముల రహస్యమెఱిఁగినవాడును స్మృతుల ధర్మమును తెలిసినవాఁడును సంస్కృతభాష కూలంకూషముగ నేర్చినవాఁడును విద్యాసముద్రుఁడు నగు మాక్సుముల్లరు పండితుఁడు నివసించియుండుటచే వివేకానందు