పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

40

మహాపురుషుల జీవితములు


"దేశమునం దిప్పుడున్న తెగలు, దేవాలయములు మొదలగు వానిపై నమ్మకములేక మంచిమత మేదని నేను విచారించుచున్న సమయమునఁ గలకత్తాబ్రహ్మసమాజ గ్రంథ మొకటి నాచేఁబడెను. అందు 'బ్రహ్మసమాజమన నేమి' యను ప్రకరణమును జదువఁగా నది నామనస్సునం దున్న మతమునకు సరిపడియె. ప్రపంచమునందలి యేగ్రంథముగాని యాత్మావబోధమునకు సరిరాదనియు భగవంతుఁ డంతరాత్మకు స్వయముగ గోచరుఁడగునపుడు వెలుపలనుండు నుప దేష్టలతోఁ బని లేదనియుఁ బ్రతిమనుష్యుఁడు నాత్మైక వేద్యుఁ డగు నాపరబ్రహ్మమునకే మ్రొక్కవలయుఁగాని తదన్యవస్తువులకు మ్రొక్కఁ గూడదనియు నాయభిప్రాయము. అట్లు తోఁచినతోడనే నేను హిందూ దేశమునఁ బరిశుద్ధాస్థిక మతమును బోధించు బ్రహ్మసమాజమునఁ జేరితిని."

1859 వ సంవత్సరమున బ్రహ్మమతపాఠశాల స్థాపింపఁబడఁగాఁ గేశవచంద్రుఁడు దేవేంద్రనాథునితోఁ గలసి భగవదాస్తిక్యమునుగూర్చి వరుసఁగాఁ కొన్ని యుపన్యాసముల నిచ్చెను. అటు పిమ్మట నతఁడు తనచేత నిదివఱకు స్థాపితమయిన నాటక సంఘముచే విధవావివాహ మను నాటకమును బ్రయోగింపఁ జేసెను. అది ప్రదర్శింపఁబడినప్పుడు పౌరులనేకులు వచ్చినందున నగరమం దంతట పెద్ద సంక్షోభము కలిగెను.

కేశవుని బంధువులు వాని నేఁదైన దగిన యుద్యోగములోఁ ప్రవేశపెట్టఁదలఁచి యతని కిఱువది రూకలజీతము గల గుమస్తా పనిని బంగాళాబ్యాంకులో నిప్పించిరి. ఒకసంవత్సరములోనే వాని జీతము ద్విగుణమయి యింకనువృద్ధిపొందునట్లు గనిపించెను. ఇట్లుండ బ్యాంకుపై యధికారి యగుదొర తనబ్యాంకు సంబంధమగు నేసంగతులును క్రింది యుద్యోగస్థు లెవ్వరికిఁ జెప్పఁగూడదని యానతిచ్చి