Jump to content

పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/439

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెంబాకం రామయ్యంగారు

ఈయన 1826 వ సంవత్సరమందు జెన్నపట్టణమున జన్మించెను. సర్. తామస్ మన్రోగారు గవర్నరుగానున్న కడపటిదినములలో నీయనతండ్రి రివిన్యూబోర్డులో రికార్డు కీపరుగా నుండెను. ముగ్గు రన్నదమ్ములలో రామయ్యంగారు కనిష్ఠుడు. తక్కిన సోదరు లిద్దఱు మేనమామయైన వెంబాకం కృష్ణయ్యంగారివద్ద బెఱుగుచు వచ్చిరి. ఈకృష్ణయ్యంగారు మనదేశము కంపెనీవారు పరిపాలించెడు దినములలోఁ దూర్పుసముద్రపు రేవులలో ధాన్యాదులవర్తకముఁ జేయుచుండెను. చిన్నప్పుడు రామయ్యంగారు మంచియారోగ్యము లేక తరచుగ జబ్బుపడుచు వచ్చినందునఁ దలిదండ్రు లాయనను గొన్నిసారులు పాలారునదీ తీరమందు సీవరము గ్రామమందున్న మేనమామవద్దకును గొన్నిసారులు చెంగల్పట్టువద్దనున్న స్వగ్రామమగు వెంబాకమునకును నీటిమార్పు గాలిమార్పుల నిమిత్తము పంపుచువచ్చిరి. చిన్న జీతములు పెద్దకుటుంబములుఁగల గృహస్థుల కేదినములలో నైనను బిడ్డలకు గొప్పవిద్య జెప్పించుట కష్టముగదా. కాని ముందు వెనుకలు చక్కఁగా దెలిసినదియు మితవ్యయము యొక్క యుపయోగ మెఱిఁగినదియుఁ బరమశాంతయు యోగ్యురాలు నగు రామయ్యంగారి తల్లి సొమ్ముక్లుప్తముగా వ్యయముఁ జేసి కుటుంబముఁ గడపి కుమారున కాదినములలో నున్న మంచివిద్యఁ జెప్పించెను. 1841 వ సం||న నెల్ఫిన్‌ష్టన్ ప్రభువు గవర్నరుగానున్నప్పుడు చెన్నపట్టణమందు గవర్నమెంటువా రొక హైస్కూలు స్థాపించిరి. అది బయలుదేఱఁగా నందులో నాఱుగురు విద్యార్థులు చేరిరి. అందులో రామయ్యంగా రొక్కరు. ఈయన సహాధ్యాయులైన తక్కిన యైదుగు రెవరనఁగా 1 మహామంత్రియైన రాజా సర్ టి. మాధవరావుగారు. 2. చెన్నపట్టణపు హైకోర్టులో మొదటి ప్లీడరు