పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/437

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

370

మహాపురుషుల జీవితములు

శేషాద్రయ్యరు స్థిరమనస్సుగలవాఁడు. ఎవరైన నెదిరించిన కొలఁది నాతనిపట్టుదల యధికమయ్యెడిదఁట. ప రేంగితజ్ఞాన యాయనకున్నట్లు మరెవ్వరికి లేదని చెప్పుదురు. అందుచేతనే లక్షణములం గనిపెట్టి తగినవారినే తనక్రింద యధికారులుగా నేర్పఱచుకొనెను. ఒకరిమీఁద క్రోధము మఱి యొకరిమీఁద దయ యను పక్షపాతము లాయనకడ లేవు. అన్నియుఁ దెలిసినవాఁడయ్యు నీతఁ డొకచిన్న పొరపాటుఁ జేసెను. గొప్పయుద్యోగములలో మైసూరులోఁ బుట్టిన జనులను బ్రవేశపెట్టక యాతఁడు తఱచుగా జెన్నపురి రాజధానిలోని వారినే తెచ్చి ప్రవేశపెట్టెను. ఆదేశస్థులనే బ్రవేశ పెట్టినచో వారు జాతిమత పక్షపాతముగలిగి వర్తింతురనియు విద్యలో విశేషముగ నారితేఱినవారు గాకపోవుటచే ననర్హులనియుఁ దలంచి యాయన విదేశస్థులఁదెచ్చినచో వారు పక్షపాతము లేక ప్రజ్ఞాఢ్యులై యుందురని తలంచి యట్లుచేసెననియు నది పొరపాటు కాదనియు నాయన పక్షమువారు తలంతురు. కారణ మే మయినను శేషాద్రయ్యరు మైసూరుజనుల కిష్టుఁడుగాకపోయెను. ఇందతఁడు సంస్థానముయొక్క క్షేమమునే గోరెను. స్వలాభము జూచుకొని పని చేయ లేదని శత్త్రువులైన నొప్పుకొందురు.

ఆయన యెల్లప్పుడు నీతిపరుడై వ్యవహరించెను. రాజకార్యములతో స్వకార్యముల నెన్నఁడు నాయనకలిపి యెఱుఁగడు. తన సొంతసొమ్మయినఁ జెన్నపురములో నున్న బ్యాంకులో వేసికొనెనే కాని మైసూరు సంస్థానపు బ్యాంకులో నెన్నఁడు వేసికొనలేదు. చిరకాలము వేలకొలది రూపాయల జీతములుగల యుద్యోగములు చేసినను శేషాద్రయ్యరు పనిమానుకొను నప్పటికి దనపదవి వహించిన వారియందఱికంటె పేదవాఁడుగనుండెను. అందుచేత మైసూరు మహారాజుగా రాయనకు నాలుగులక్షల రూపాయలు రొక్కమును