పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/379

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తండాళం గోపాలరావు

తండాళం గోపాలరావుగారు కావేరీ నదీతీరమున కుంభకోణమునకు సమీపమందున్న గణపతి యగ్రహారమున 1832 వ సంవత్సరమున జన్మించెను. ఈయన మహారాష్ట్ర బ్రాహ్మణుఁడు. పదునేడవ శతాబ్దమందు మహారాష్ట్రులు స్వదేశమువిడిచి తంజావూరునకువచ్చినప్పుడు వీరికుటుంబముగూడ దక్షిణదేశమునకు వచ్చి యచ్చట స్థిరముగ నుండెను. ఈయన తాతపేరు తండాళము జీనన్న. ఆయనకు రామచంద్రపండితుఁడని నామాంతరముఁ గలదు. ఆయన కొంతకాలము తంజావూరు మహారాజువద్ద పనిచేసి పిదప నింగ్లీషు దొరతనమువారివద్ద తహసిల్ దారయ్యెను. ఆయన కుమారుఁడు గోపాలరావు తండ్రియు రాఘవపండితులను నామాంతరముగల బావాపండితుఁడు. సుప్రసిద్ధుఁడైన శరభోజీ మహారాజువద్ద కొన్నినాళ్ళు పని చేసెను. ఆయన కైదుగురు కుమారులు. గోపాలరావందుఁ గడపటివాఁడు. బావాపండితుఁడు గణపతి యగ్రహారమున మూడుసంవత్సరము లుద్యోగవశమునుండి పిమ్మట తిరువడియను గ్రామమున గొంతకాలముండి యాకాలమున తిరువాన్కూరు సంస్థానమున మంత్రియు రాజా మాధవరావుగారి తండ్రియగు నగు దివాను రంగారావుగారి యాదరణమునఁ దిరువాన్కూరునకుఁ బోయెను. బావాపండితుని కుమారుల కిద్దఱకు వెంటనే యాసంస్థానమున నుద్యోగములయ్యెను. తిరువాన్కూరులో నున్నపుడె బావాపండితుఁడు కాలధర్మము నొందెను. కాలధర్మము నొందుటచే వాని కుటుంబము తంజావూరునకుఁ దిరిగి వచ్చెను.

గోపాలరావు తక్కిన సోదరులవలెనే తండ్రివద్ద బాల్యమున సంస్కృత మహారాష్ట్ర భాషలనేర్చుకొనెను. ఆకాలముననింగ్లీషులోఁ