పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/375

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

316

మహాపురుషుల జీవితములు



పదునాఱుసంవత్సరములు హైకోర్టుజడ్జిగ నుండి యానడుమ 1893 వ సంవత్సరమం దొకసారి ప్రధాన న్యాయాధిపతిత్వమునందు మూడు మాసములు ప్రతిష్టింపఁబడి యాదొరతనమువారి యేలుబడిలో స్వదేశీయుఁడధిష్ఠింపఁదగిన మహోన్నతపదవిని బ్రాప్తించెను. దొరతనమువారు వాని రాజభక్తికి మెచ్చి కె. సి. ఐ. యి. అనుబిరుదముగూడ నిచ్చిరి. అంతటి కీర్తి తేజముతోఁ బ్రకాశించుచుండిన యాతని జీవిత కాలము 1895 వ సంవత్సరమున జనవరి నెలలో ముగిసెను.

ఆయన జడ్జీగా నుండుటచేత నితర లౌకిక వ్యవహారములలోఁ బ్రవేశించుటకుఁ దగిన వీలు లేకపోయెను. గాని యూనివర్సిటీ యని పిలువఁబడు విద్యాపరిషత్తునందు సభికుఁడైవిద్యాభివృద్ధివిషయమునఁ జాల పాటుపడుచు వచ్చెను. విద్యార్థులు బి. యే. బి. యల్., యం. యే. యం. యల్. మొదలగు పరీక్షలలోఁ గృతార్థులైనపిదప వానికి విద్యా పట్టము లిచ్చుటకు బ్రతి సంవత్సర మొక సభ జరుగును. ఆసభ పేరు "కాన్వో కేష" నందురు. అప్పుడు విద్యాభ్యాసము ముగించిన యా శాస్త్రబ్రహ్మచారులకు శాస్త్రాధిపతులకు రాజధానిలోనున్న గొప్ప వాఁడొకఁడు హితోపదేశము చేయుట యాచారముగ నున్నది. అట్టి యుపదేశమదివరకు తెల్ల వారే చేయుచు వచ్చిరి. స్వదేశస్థులను గూడ కొందఱి నిటీవల తత్కార్యమునకు నియమింపఁబడుచు వచ్చిరి. అందు మొదటివాఁడు ముత్తుస్వామి అయ్యరు. అతని యుపదేశము సర్వవిధముల శ్లాఘనీయముగ నుండెనని యది విన్నవారంద రభిప్రాయపడిరి. తనకు విద్యాగురువగు పవెలుగారియెడల నతఁడెంతో కృతజ్ఞుఁడై యుండెను. పవెలుగారివంటి మిత్రుఁడు హిందువులకు మఱియొకఁడు లేఁడని యతఁడు పలుమారు చెప్పుచువచ్చెను. కుంభకోణము కాలేజీ ప్రధానోపాధ్యాయుఁడగు తండాళం గోపాలరావుగారి విషయమున నతఁడిట్లు చెప్పుచువచ్చెను. "నాజీవితకాలములో నేను