పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/365

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

306

మహాపురుషుల జీవితములు



తహసిల్‌ దారను పేరుగూడ గలదు. తంజావూరు కలక్టరుగారగు మాంటుగొమనీ దొరగారికి ముత్తుస్వామి నాయకన్ కొంతకాలము బట్లరుగానుండి తరువాత తహసిల్ దారయినందున బట్లరు తహసిల్ దారని పేరుగలిగెను. చిన్నముత్తుస్వామి తహసిల్ దారు ముత్తుస్వామియొక్క ప్రాపకము సంపాదించుకొనుటకు నీ క్రింది కారణము చెప్పుచున్నారు.

ఒకనాడా తహసిల్‌దారునకు సమీపమందున్న నదిగట్టు వరదచేత గండి పడినదని వర్తమానము తెలిసెను. తోడనేయతఁడు కచేరీకిబోయి దానివిషయమున గొన్నిసంగతులు కనుగొనుటకు గుమస్తాను రమ్మని వర్తమాన మంపెను. గుమస్తాలెవరు నప్పుడు కచేరీలో లేనందున బాలుఁడగు ముత్తుస్వామి తహసిల్‌దారు కడకుబోయి యేమి సెలవని యడిగెను. తహసిల్‌దారు తనకు వచ్చిన కాగితము ముత్తుస్వామి చేతిలోఁబెట్టి యా గండి విషయమున గొన్ని సంగతులు గావలయునని చెప్పెను. ముత్తుస్వామి తానది కనుగొని వత్తునని చెప్పి తక్షణమే యా నదియొడ్డునకుఁబోయి గండి కొలుచుకొని దానిని పూడ్చుటకుఁ గావలసిన మట్టి మొదలగునవి యెంత కావలయునో తెలిసికొని మరల తహసిల్ దారువద్దకు వచ్చెను. తహసిల్ దారు మొట్టమొదట ముత్తుస్వామికట్టిన లెక్క నమ్ముట కిష్టము లేనివాఁడయ్యు నవసరమున యతఁడు వ్రాసిన కాగితముమీఁద వ్రాలుచేసి పంపెను. పంపి యాతహసిల్‌దారు ముత్తుస్వామి వ్రాసిన లెక్క సరియగునో కాదో తెలిసికొనుటకు తన హెడ్ గుమాస్తాను గండివద్దకు పంపెను. అతఁడదిచూచివచ్చి ముత్తుస్వామి వ్రాసినలెఖ్క సరిగా నున్నదని చెప్పెను. మఱియొకనాడు మిరాశీదారుఁ డొకఁడు తహసిల్ దారుకడకు బోయి తాను సర్కారుకీయవలసిన పన్నెంత యని యడిగెను. అతని కిరువదియూళ్ళలో భూములుండుటచేత