పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/314

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సి. వి. రంగనాథశాస్త్రి

సి. వి. రంగనాథశాస్త్రి

కలమూరు వీరవల్లి రంగనాథశాస్త్రి చెన్నపురి రాజధానిలోని చిత్తూరుపట్టణమునకు సమీపముననున్న యొక గ్రామములో 1819 వ సంవత్సరమున జన్మించెను. ఆతని తండ్రి మిక్కిలి దరిద్రుఁడు. సంస్కృతమునందు గొప్పపండితుఁడు. నిరుపేదతనమునకు నిలయమైన యింటఁబుట్టి పెరుగుటచే దల్లిదండ్రు లాబాలునకు సంస్కృతవిద్య తప్ప మరియొక విద్య నేర్పింపలేకపోయిరి. బాల్యమందతఁడు కుశాగ్రబుద్ధి యని చెప్పుదురు. ఎనిమిదేండ్ల యీడుననే సంస్కృతము చక్కగ మాటలాడుటకు శ్లోక మన్వయించుటకు నతఁడు సమర్థుండయ్యెను. ఆటలయందు వానికి మిక్కిలి యభిరుచి కలుగుటచే నతఁడు వీధిబాలురతోగలసి గంతులు వేయుచుండును. పదియేండ్ల కాలమున నతఁడు గ్రామములోని పొడవైన చెట్లన్ని యెక్కి యెత్తయిన గోడలన్ని దాఁటి యాటలాడుచు వచ్చెను. అతఁడు పండ్రెండు సంవత్సరముల వయస్సువాఁ డైనప్పుడు ముందు ముందు వాని గొప్పతనమునకుఁ గారణమైన యొక సంగతి జరిగెను. అతని తండ్రి దొరతనమువారివద్దఁ గొన్ని గ్రామముల నిజారాకు పుచ్చుకొని పంటలు చెడిపోవుటచే దాను చెల్లింపవలసిన సొమ్ము చెల్లింపలేక పోయెను. ఆకాలపు పద్ధతినిఁబట్టి దొరతనమువారు శిస్తు చెల్లించనందున వానిం జెరసాలలోఁ బెట్టిరి. తండ్రి కారాగృహము నందుండగా రంగనాథుని తాతగారి యాబ్దికదినము సమీపించెను. రంగనాథునితల్లి యేమిచేయుటకుం దోచక యేడువసాగెను. రంగనాథుడు తల్లికడకుబోయి యామెదుఃఖకారణము దెలిసికొని మిక్కిలి జాలినొంది చెఱనుండి తండ్రిని విడిపించి తెచ్చుటకై చిత్తూరుపట్టణ