పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈశ్వరచంద్ర విద్యాసాగరులు

11



ఆమాటలు విని రామమోహనుఁడు కోపోద్దీపితుఁడయి తుచ్చ గౌరవములు సంపాదించుటకయి తానుమతము మార్చుకొననని వానితో స్పష్టముగఁ జెప్పి యానాఁడుమొద లాదొరగారితో స్నేహము మానెను. గ్రంథవిస్తరభయమునమానవలనెగాని రామమోహనుని యౌదార్యవినయశాంతగుణములను దెలుపుకథ లనేకము లున్నవి. అంతటి నీతిశూరుఁడు లోకోపకారియు మరల నిప్పటివరకును మన భరతఖండమున జనియింపక పోవుటయే, యాతఁడు సుగుణసంపదలో నద్వితీయుఁడని చెప్పుటకుఁ దార్కాణము "ఏకమేవా ద్వితీయం బ్రహ్మ" అను నుపనిషద్వాక్యమును నమ్మి యాతఁడు విగ్రహారాధనము నిరాకరించి పరిశుద్ధాస్తికమతము నవలంబించెను. గావున దయామయుఁడగు నాపరబ్రహ్మమే యాతని యాత్మకు శాశ్వతానంద మిచ్చుగాత.


ఈశ్వరచంద్ర విద్యాసాగరులు

హిందూ దేశమున మృతిపొందిన భర్తతో చిచ్చునఁబడిచావ వలసిన యాడువాండ్రను బ్రతికించి దేశమునకు మహోపకారము జేసినయతఁడు రామమోహనరాయలు ; అతని ప్రసాదమున బ్రతికిన వితంతువులను యావజ్జీవ మిహలోక నరకమగు వైధవ్యమునుండి తప్పించి వారిని మరల ముత్తయిదువలఁ జేసి పసపుకుంకుమలు నిలిపిన పరమోపకారి యీశ్వరచంద్ర విద్యాసాగరులు

ఈయన బంగాళాదేశ కులీన బ్రాహ్మణుఁడు. ఈతఁడు 1820 వ సంవత్సరమున హుగ్లీమండలములోని వీరసింఘ గ్రామమున నొక నిరుపేద కుటుంబమునం బుట్టెను. వాని తాతయగు రామజయబెనర్జీ సన్యాసియై దేశాటనముఁ జేయుచు కాలక్షేపము చేసెను. తండ్రి యగు ఠాకరుదాసుబెనర్జీ యొక వర్తకునియొద్ద నెలకు పదిరూపాయిల