పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

166

మహాపురుషుల జీవితములు

ఈతని భార్య దాతృత్వమున నీతని మించినది. బొంబాయినగరమునకు పాలసత్తీయను చిన్న ద్వీపమునకు నడుమనున్న వంతెన యీతని భార్యచేసిన దానమువలననే కట్టఁబడినది. అ వంతెన ముగింప బడినప్పుడు గవర్నరుగారగు సర్ జార్జి ఆర్తరు దొరగారు జీజీభాయిగారి భార్యను గొనియాడుచు నీక్రింది విధముగాఁ బలికిరి.

"1841 వ సంవత్సరమున వర్షకాలమం దొకనాఁడు రమారమి యిరువది పడవలు బొంబాయినుండి పాలసత్తికి గొందఱు మనుష్యులం తీసికొనిపోవుచు మునిఁగిపోయెను. ఈ యుపద్రవముచే జను లనేకులు మృతినొందిరి. జీజీభాయిగారి భార్య యతిదారుణమగు నీ వర్తమానమును విని ఖేదపడి యక్కడ యొకవంతెన దొరతనమువారేల కట్టింపఁగూడదని కొందఱి నడిగి ప్రాణాపాయమును నివారించు నట్టి సత్కార్యములను జేయుటకు దొరతనమువారు సొమ్ము వెచ్చించుటకు బూనుకొనరనివిని తన స్వంత సొమ్మిచ్చి యా మహాకార్యమును తానే నిర్వహింప నిశ్చయించుకొని యాపని కెంతసొమ్మగునో తెలియఁజేయుమని యింజనీరుల నడిగెను. అప్పుడు కొంద ఱింజనీర్లు చక్కఁగా విచారించి యా కార్యమున కఱువదియేడు వేల రూపాయిలు సరిపోవునని యంచనా వేసిరి. సాధారణముగా గొప్ప పనులకుఁ గావలసినసొమ్మునకు ఇంజనీరులు వేయు నంచనాలకు సంబంధముండదని మీరంద ఱెఱుంగుదురు. ఈ వంతెనకు వారు వేసిన యంచనాసొమ్ము నిజముగా గావలసిన సొమ్ములో మూడవవంతై యుండెను. దయాస్వరూపిణి యగు జీజీభాయి దొరసాని యింజనీరువారు కోరినసొమ్మంతయు (అనఁగా నఱువదియేడు వేల రూపాయలు) నిచ్చి తన సంకల్పించిన ధర్మకార్యము నెఱవేరునని యువ్యిళులూరుచుండ నింజనీరులు సొమ్మంతయుఁ బనిలో మూడవ వంతునకే సరిపెట్టి కాళ్ళుచాపుకొని కూర్చుండిరి. పనియాగిపోయి నదనివినియాయిల్లాలు