పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10

మహాపురుషుల జీవితచరిత్రములు



షుఁడు మరల స్వదేశమునకు వచ్చి తన యాత్రావిశేషముల దన మిత్రులకుఁ దెలుప నతనికి కాలము లేదయ్యెను.

1833 వ సంవత్సరము సెప్టెంబరునెలలో డాక్టరు కార్పెంటరు దొరగారు వానిని బ్రిస్టలునగరమునకు బిలుచుకొనిపోయి, గౌరవించెను. అక్కడనుండఁగ నాయనకు, సెప్టెంబరు 10 వ తారీఖున జ్వరముతగిలెను. ప్రజ్ఞావంతులగు వైద్యు లెన్ని చికిత్సలఁ జేసినను కార్పెంటరుదొరగారెన్ని శ్రమలబడినను, నవియెల్ల నిరర్థకములు కాఁగా హిందువుల భాగ్యదోషమున రామమోహనరాయలు సెప్టెంబరు 27 వ తేదీని కాలధర్మము నొందెను. అక్కడిమిత్రు లామహాత్ముని బ్రిస్టలునగరసమీపమున భూస్థాపితము చేసిరి. పిమ్మట పదిసంవత్సరములకు రామమోహనుని ప్రియమిత్రుఁడగు ద్వారకనాథ టాగూరుగారు సీమకుఁ బోయి యాపురుషశ్రేష్ఠునకు నొకసమాధి గట్టించి ధన్యుఁడయ్యెను.

పదునాలుగేండ్ల వయసు వచ్చినది మొదలు దేశమునిమిత్తము దేశస్థులనిమిత్తము, పలుకష్టములఁబడి యాసుజనుడు తుదకు పర దేశమున బంధుమిత్రులు లేనిచోట దేశోపకారార్థమై ప్రాణముల విడిచెను. ఈలోకోపకారకుని ఋణము భరతఖండవాసు లెన్నిటికిని దీర్చుకొనఁజాలరు. ఈతఁపు కార్యశూరుఁడు. అవసరమయినయపుడు సకలకష్టములకులోనై ధైర్యముతో నిలిచి తనకు మంచిదనితోచెడు కార్యమును నిర్వహించెడివాఁడు. దయామయుఁడు, ధర్మశాలి ; స్వగౌరవమును జక్కఁగఁ గాపాడుకొనుచు నీతిమార్గము ననుసరించువాఁడు. మతవిషయమునను స్వదేశవిషయమునను ప్రతిమనుష్యునకు స్వాతంత్ర్య ముండదగునని యతనివాదనము. ఒకనాడు డాక్టరు మిడిల్‌టన్ అను క్రైస్తవమతబోధకుఁడు రామమోహనునిం బిలిచి క్రైస్తవమతమునం గలియుమని బోధించి దానివలన పలుకుబడి, ధనము, అధికారము, గౌరవము, కలుగునని నొక్కి చెప్పెను.