పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్వామి దయానంద సరస్వతి

143

తానెటుపోయిన బంట్లు పట్టుకొనకమానరని యొక యాలయమున మఱిచెట్టిక్కి చిట్టచివర కొమ్మమీఁద యేరికిం గనఁబడకుండనాకుల మధ్య గూర్చుండెను. తండ్రి బాలునింగానక బంట్లం దిట్టి కొట్టి మరలఁ వానివెదకి తేరఁబంచెను. ఆ బంటులు సిద్దిపురమునఁ బ్రతి గృహము ప్రతిచోటు వెదకి వెదకి వానిని గానక విసికిరి. కొందఱు బంట్లు దయానందుఁడు గూర్చున్న చెట్టుక్రిందను గుడిలోను వెదకిరి గాని దయానందుఁడు నిశ్శబ్దముగఁ గూర్చుండుటచే వానిం గనుగొన లేకపోయిరి. తండ్రి విఫలప్రయత్నుఁడై మరల యొప్పటియట్లు తన యూరికిఁ బోయెను.

దయానందుఁ డాపగలంతయుఁ జెట్టుమీఁద గూర్చుండి రాత్రి దిగివచ్చి పయనమై పోయెను. దొరకినప్పు డన్నముదినుచు దొరకనప్పు డుపవసించుచు నిదురవచ్చినచోటనే పండుకొనుచు నాబాలుఁడు దేశముల వెంబడి బయలుదేరెను. ఆ పయనములో నొకసారియెలుఁగు గొడ్డొకటి వానిపై బడవచ్చెను. దయానందుఁడు మనశ్చాంచల్యము వీడి ధైర్యము దెచ్చుకొని యెలుఁగున కెదురుగ నిలిచి దానిముక్కుఁమీద నొకగుద్దు గుద్దెను. ఆ బెబ్బతో యది నెత్తురు గ్రక్కు కొనుచుఁ నఱచుచు బాఱిపోయెను. మఱియొకనాఁడతడొక యూరికిఁబోవ నచటి దేవాలయధర్మకర్తయగు మహంతు వాని నాదరించి తనవద్దనుండి గుడి పెత్తనము సేయుమనియు గావలసిన ధనమిత్తుననియుఁ బలికెను, "ధనము గావలసినచో మాయింటివద్ద తండ్రికడనే యుందును. నాకక్కరలే" దని చెప్పి యచ్చోటు వాసిపోయెను. మఱియొకసారి యతఁడొక యడవిలోనుండి పోవుచు దారితప్పి ముండ్లకంచెలలోఁ బడెను. వెనుకకు వెళ్ళినచోఁ బోదలఁచిన గ్రామము సత్వరముగఁ జేరవీలులేదని యాముండ్లత్రోవనేపట్టి కాళ్ళనిండ ముండ్లు గ్రుచ్చుకొన్నను శరీరము గీచుకుపోయినను లెక్క సేయక గమ్యస్థానమునుఁ