పుట:Kumbharaana020881mbp.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్థలం ఏడు] కుంభ రాణా 59

మురళి : ఆపక్కంగటి సేటు ఆయన కడుపు సల్లంగుంటె - దాని కరీదు యిరవయి రూపాయలని చెప్పినాడు. ఆపాట మల్లీ దునీచందుసేటు దగ్గిరికి పోయి నీపయికంతీసుకోని నా మోరీఅన్నా యియ్యీ, లేకుంటె యిరవయి రూపాయలన్నా యియ్యీ అని బతిమాలినాను. మోడేసుకొన్నాను. ఏమీచేసినా నాకోడికి మూడే కాళ్ళంటాడు. ససేమంటే ససేమంటాడు. మోరీయెత్తి తిత్తిలో యేసుకొని పెట్లోపెట్టి బీగంయేసి, మొల్లో యేసుకొన్నాడు. నేను మల్లీ గట్టిగా అడిగితే నీవిక్కడ అల్లరిచేస్తే దొంగసొత్తని చెప్పి దండాధికారికి పట్టిస్తాను కబరారని గుడ్లు మిటకరించాడు. ఆపాట నేను యిదంతా యిన్నపం చేసుకోడానికి దండాదికారిదగ్గిరికి పోయినాను. పోయినపాటనే అక్కడవుండిన నౌకరి నాచేతికి యిసనకఱ్ఱ పట్టిచ్చి ఆయన యాడకో జారుకొన్నాడు. నేను విసుర్తూ మనవి చేసుకొంటూ వుణ్యాను. అయ్యగారు మెల్లంగా కన్నుమాల్చినారు. రెండు గెడియలకి మేల్కొని సరే అంతా విన్నానుగాని, దునీచందు నీమీద ఫిర్యాదుచేస్తే అప్పుడు విచారిస్తాము పో అని పంపేశాడు. నామోరీ యిప్పించేమాట మరిశేపొయ్యాడు.

శ్యామ : నీమనివి యా మోరీని తిరుగ యిప్పించమనియే కదా.

మురళి : అదేనండి మహప్రేభో.

రాణా : శ్యామలరావుగారూ, చూచితిరా మన పరిపాలనా సౌష్ఠవము, దండనీతి విధానము ? ప్రజల మనస్సులేకాదు పాలనా యంత్రము కూడా సంస్కరింపఁ బడవలయును.

శ్యామ : చిత్తము.

రాణా : నీకు మొహరీ యెక్కడిదిరా ?

మురళి : నిన్నటిరాత్రి ముసాపురిఖానా వద్ద గుస్తు తిరుగుతుణ్యాను. నేను అందరి తలారివాళ్ళలాగ రాత్రంతా నిద్రపోయి పొద్దున్నేలేచి కాగడా పట్టుకోని వచ్చేవాణ్ణి కాదండి. గుట్టుగా నవుకరి చేసుకోని బతికేవాణ్ణి.