స్థలం ఐదు] కుంభ రాణా 41
చలిది చిక్కంబుల సడలించి యన్నంబుఁ
బెట్టవేయని పేర్మిఁ బిలువరాదొ;
అలసితి నొక్కింత తలిరువీవన వీవు
ప్రేయసీ, యని యాజ్ఞవెట్టరాదొ;
మనసయ్యె భువన మోహనగాన మొనరింప
మురళి యిమ్మని చూడ్కి నెఱపరాదొ;
తలిరుటాకులు పూవులు దండగట్టి
మెడను గీలింపుమా యని నుడువరాదొ;
అట్టి యుపచారముల కే ననర్హ నైన
నిష్టముండిన రీతి నన్నేలరాదొ!
[ధ్యాననిమగ్నయగును]
[అగ్బరు తాన్సేనులు వైద్యుల వేషముతో ప్రవేశింతురు]
అగ్బరు, తాన్సేనులు : తల్లీ, చరణదాసులము. [దండము పెట్టుదురు.]
మీరా : [ఆనంద పారవశ్యమున నుండును]
తాన్ : దర్శనమాత్రముననే ధన్యులము.
అగ్బ : గానమువిన్న నేమి యగుదుమో!
మీరా : నందనందనా, దివ్యసుందరశరీరా, నీవంటి సుకుమార కుమారుని ఆకొండ తిప్పలలో ఆ యరణ్యములలో పసుల గాచుటకు ఆ యశోదాదేవి యెట్లుపంపెను? ఆనందుఁ డెట్లియ్యకొనెను ? తలిదండ్రుల హృదయము లింత కఠినముగ నుండునా ?