పుట:Kumbharaana020881mbp.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్థలము మూడు] కుంభరాణా 17

శుష్క వైరాగ్యము సామాన్య గృహస్థ ధర్మములకు భంగము గలిగించుచున్నది.

మీరా : [దీనముగ] అయ్యో! అందుకు నేనేమిసేయుదును ? నా మనస్సు నాస్వాధీనము కాకయున్నది. కన్నులు మూసినను దెఱచినను శ్రీకృష్ణుని దివ్యమంగళ విగ్రహము నాయెదుట నిలిచినట్లు పొడకట్టును. ఒక్కనిమిషమా రాధావల్లభుఁడు నాకన్నులకుఁ గట్టకున్న లోకమే మునిఁగిపోయినట్లు అంతయు శూన్యముగ నగపట్టును. నిమిషమొక్క యుగముగ విశ్లేషదు:ఖ మనుభవింతును. ఇట్టి జీవితము నాకు స్వభావికమైనది. ఇందు మీకేమి విపరీతము తోఁచుచున్నది ?

రాణా : అందు విపరీతము కానిదేమున్నది ? [స్వగతము] ఇంతదనుక యీ కాంతను తనదారిని తన్నేఁగనిచ్చినందులకు నేనే నింద్యుఁడను. అయినను పూర్వస్మృతిని కొంత కలిగించి చాచెదను. [ప్రకాశము] ప్రేయసీ, యటుచూడుము. ఆసుందర సరోవర ప్రాంతమును మఱచితివా ?

మీరా : లేదు.

రాణా : తామరపాకువెంబడి నిలుచుండి యాకొంగ చేయుచుండిన యుదర పూరణ తపస్సును చూడుము:

                      ధ్యాన నిర్మగ్నమైనిల్చి యా బకంబు
                      కాలు దవిలిన చేపలఁ గఱచితినును,
                      కపట వైరాగ్యనటనల ఘనతచూపి
                      గ్రుడ్డిలోకుల వంచించు గురుని పగిది.

మీరా : నాథా, నిశ్చింతముగ జీవితమును వ్యర్థముసేయుచున్న యాబేడిస త్రుళ్ళిపాటును దిలకింపుఁడు.