పుట:Kumbharaana020881mbp.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్థలము 3 ఉదయపురము.

_________

[ఉద్యానవనము. ఒక సరోవరము, అందు చేపలుతినుచున్న కొంగయు అగపడును. కుంభరాణా పరాయత్తచిత్తుఁడై ఒకపూవును వాసన చూచుచు చలువఱాతిబండపయి కూర్చుండియుండును.]

రాణా : నానాఁటికి మాయంత:పురము నే నడుగిడుటకు యోగ్యముగాని సన్న్యాసిని మఠమగుచున్నది. అచ్చట పూర్వమునవలె హృదయరంజన మొనరించుట కొక్క చిఱునవ్వుగాని, ఒక్క ప్రేమావలోకనముగాని, తుదకొక్క తియ్యని మాటగాని కఱవయ్యెను. నా ప్రాణేశ్వరి క్రమక్రమముగ నాచేతినుండి జాఱిపోవుచున్నది. ఆపాడు మత మేనాఁడు మా యింట నడుగు వెట్టినదో ఆనాఁటినుండియు మా యిరువురి యనురాగ బంధములు సడలి పోయినవి. ఆ విరాగిణి హృదయమున నాకిప్పు డించుకయైన చోటులేదు. [నిట్టూర్చి] నేఁడు నేను కేవలము భర్తను, ప్రాణవల్లభుఁడను. పుప్పొడి రస్తావలె కనుపడుచుండిన మా జీవిత మార్గము నేఁడు కంటకశిలా భూయిష్టమయి అసహ్యమయి ఘోరమయి పొడకట్టుచున్నది - నాసంసార మసారమయి నరకప్రాయమైనది.

[మీరాబాయి, సుశీల పువ్వుల బుట్టతో ప్రవేశింతురు.]

మీరా : నాథుఁడిచ్చటనే యున్నాఁడు. సుశీలా, మనమా వంకకు పోయి పూవులు కోసికొందము. పూజా సమయము కావచ్చినది.

[ఇరువుఱును రాణాకు కొంచెము దూరమునఁ బోవుచుందురు.]