పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
42

జగతిలో మిమ్ముఁ బోలిన సత్కవులను
కొందఱినినైనఁ బుట్టించి కోర్కెమీఱ
భరతవర్షంబునకు మేలు నెఱపుకొఱకు
వినుతిజేయుచునున్నాఁడ విశ్వనాథు.

దేశరాజాన్వయాగార దీపమైన
కృష్ణయ బుధుండు సమధిక కీర్తిశాలి
సభకు నధిపతియై చాల సంతసింపఁ
జేసితిరి మిమ్ము దేవి రక్షించు గాక.

బాపట్ల నుండి ప్రయాణమై వెడలునపుడు చెప్పిన పద్యములు

బ్రహ్మశ్రీ వేంకట సుబ్బరాయ కవిగారు

వైరులు దుర్విచారులయి వాగి కడుంగడు నింద సేయ భా
షా రుచిరత్వ మేర్పడఁగ సత్యమసత్యమెఱుంగఁ గోరి మే
లారసి యస్మదీయ విజయధ్వజ సంస్థితి నొప్పి సద్యశో
భారముఁ గొన్న భావపుర వాసులఁ గాంచన వాసుఁడేలుతన్.

బ్రహ్మశ్రీ వేంకట రమణ కవిగారు

అజరాధీశ దిశా సరిద్విటతటోద్యద్దేవ భూజంబవై
భజమానార్య కదంబవై తనరు నో బాపట్ల పూరిందిరా
రజనీశాస్య! సతంబు సోదర కవీంద్ర స్థాపితంబైనదౌ
విజయస్తంభముఁ బ్రోవుమీ త్రిజగతీ విఖ్యాతి దీపింపఁగన్.