పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3


స్వవిషయము

కొప్పరపు సోదర కవుల చరిత్రను వ్రాయవలయునను సంకల్పము చిరకాలము క్రిందటనే నాకుఁ గల్గినది. ఒకనాఁడు గుంటూరు జిల్లాలోని సంగంజాగర్లమూడి గ్రామమునకు వెళ్లి కొప్పరపుఁ గవులను గుఱించి మీకుఁ దెలిసిన విషయములను దెలుపుఁడని విమర్శకాగ్రేసర శ్రీ కొత్త భావయ్యచౌదరి గారినిఁ గోరితిని. అపుడు వారు కొప్పరపుఁ గవుల శతావధాన పద్యములు గల యొక వ్రాఁత ప్రతిని దెచ్చియిచ్చిరి. అత్యంతానందముతో దానిని స్వీకరించి యింటికిఁ దెచ్చి భద్రముగా దాచితిని.

1910వ సంవత్సరము మే నెల 18వ తారీఖున సంగంజాగర్లమూడిలో శతావధానము గావింపఁబడినది. కాని 100 పద్యములు చెప్పలేదు. చిరకాలము క్రిందట వ్రాయఁబడినదగుట వలన నేను స్వీకరించిన తెల్లకాగితముల పుస్తకము ముట్టుకొన్నచోఁ జినిగి పోవునట్లుండెను.

1969వ సంవత్సరములోఁ బ్రచురింపఁ దలఁచి పరిచయమును వ్రాయుఁ డని కోరఁగా శ్రీ భావయ్య చౌదరిగారు వెంటనే వ్రాసి పంపిరి. కాని యపుడు ప్రచురించు భాగ్యము లేకపోయినది. ఇపుడైనను (1971) బ్రచురింపఁ గలిగి సందులకు సంతసించుచున్నాఁడను.

శతావధానమును దయతో నొసంగి పరిచయమును వ్రాసిన విమర్శ కాగ్రేసర శ్రీ కొత్త భావయ్య చౌదరిగారికిని, దొలిపలుకును వ్రాసిన శ్రీ పదుళ్లపర్తి రామకృష్ణమూర్తి ఎం.ఏ. గారికిని నా యభివందనములు.

ఇట్లు,

సజ్జన విధేయుఁడు,

కోగంటి దుర్గామల్లికార్జునరాయకవి