పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
124

ఎవ్వారుశబ్దార్ధ మవ్వారిగ గ్రహించు
         ప్రజ్ఞలో బాలసరస్వతులయి
రెవ్వారు కుకవి మదేభాళిహరియించు
         శూరత్వమందు నాశుకవిసింహు
లెవ్వారు మధురమై యింపౌ కవిత్వరా
         జ్యంబు ప్రోచుటఁ గవిచక్రవర్తు
లెవ్వారు రయమున నేను నాశుకవిత్వ
         సురనదీవిహృతిచే సుకవి హంస

లట్టి కొప్పరపన్వవాయాబ్ధిచంద్రు
లైన వేంకటసుబ్బరాయకవి వేంక
టరమణకవుల మహిమంబుఁదరమె పొగడ
ఫణిపతికినైన వాక్సతీపతికినైన

ఒక పద్యంబుఁ బఠించి దాని మఱి వేఱొక్కండుగా మార్పుఁ డం
చొకఁడన్నన్మఱి నాల్గు శబ్దములు తానొక్కండు ముందిచ్చి కొం
కక యాంధ్రంబునఁ బద్యమల్లుఁడనినన్ గాదంచ శక్యం బటం
చకటా చంపకుఁడంచు వందనము లేమర్పింతు మంచున్ గృపా
ధికతన్ మమ్మెటొ పంపుఁడీ యనుచు నీతీరైన మేమింక మా
నుకొనన్ వచ్చు వధాన మంచు తమకున్ గోపంబు వద్దంచు త
ప్పక యెవ్వఁడవధాన మందివి యొనర్పం జాలఁడంచున్మమున్
సుకవుల్ మీరు పరాభవింపఁ దలఁపన్ సొంపౌనె యంచున్ సభన్
వికలంబౌమతి జూపుచు న్వినయమున్ భీతిన్ గనన్ జేయు వా
రికి నీ నాఁటి భవద్వధాన కవితా శ్రీపూర్ణ కీర్తుల్ శతా
ర కరోరంబులునై త్రపాప్రదములై రాణించెఁ బ్రాజ్ఞుల్ కవి
ప్రకరంబుల్ నిజముం గ్రహించి మిము సంభావించిరో కొప్రపున్
సుకవి గ్రామణులార! వేడ్కగొనుఁడిచ్చో నా నమస్కారముల్.