పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చున్నాముగాని తమయింటిలో నన్నముపెట్టుటలేదనికూడ స్పష్టముగ చెప్పెను.

రెండుమూడు రోజులకు సుబ్రహ్మణ్యముతల్లియును, భార్యయును అతనిని కలుసుకొనుటతో క్రైస్తవమతములో కలియుట మానుకొని బందరుకు వెడలిపోయెను. ఈ యాందోళన మింకను చల్లారకుండగనే ఒకనాటి మధ్యాహ్నము కళాశాలలో జూనియర్ ఎఫ్. ఏ. క్లాసులో ప్రొఫెసర్ రివరెండు లాయిడీ అనునతడు బైబిల్‌పాఠము చెప్పుసమయమున తనబూటుకాలెత్తి మీరు విగ్రహమును పూజించుటకన్న నాబూటును పూజించవచ్చునని మిక్కిలినీచముగ బల్కెనట. అంతట ఆక్లాసులోని ఇన్నూరువిద్యార్థులును మిక్కిలి కోపముతో కేకలువేయు బల్లలను బిగ్గరగ కొట్టుచు కల్లోలముగావించుచుండిరి. ఇంతలో మధ్యాహ్నము టిఫిన్‌గంట కొట్టబడెను. ఆ ప్రొఫెసర్ లేచిపోయెను. విద్యార్థులును తొందరగ పరువులిడుచు అతని వెంట బడిరి. ఆయన తప్పించుకొని ఉపాధ్యాయులగదిలో ప్రవేశించెను. ఆసమయమున మా ఫిలాసఫీశెక్‌షనుకు రివరెండు డాక్టరు కూపర్ గారు పాఠముచెప్పుచుండిరి. మేము ఆతురతతో లేచి, వెలుపలకు బోవుచున్న తక్కినవిద్యార్థులతో కలుసుకొంటిమి. ఇట్లే కాలేజీలోను హైస్కూలులో నుండు విద్యార్థు లందరును చేరి, జరిగినవిషయమును విని, హిందూమతమునకు గావింపబడిన అవమానమునకు సంతాపమునొందుచు కళాశాల సమీపమున ఆవీధిలోని కపాలేశ్వరస్వామి కోవెలముందు స్వామివారి ఉత్సవములనిమిత్తము అప్పుడే క్రొత్తగా వేయబడిన పెద్ద