పరీక్షలో తప్పిపోవుట కలిగినది. బి. ఏ. క్లాసులకు రంగయ్యచెట్టి గారను నొక దక్షిణాదివైశ్యుడు ఉపాధ్యాయుడుగా నుండెను. ఈయన గణితశాస్త్రమునందు మంచి ప్రవేశముకలవాడని చెప్పుకొనుచుండిరి. ఆయన తెలుగువా డగుటచేత కాలేజిలో తెలుగు క్లాసులపై తనిఖీకి అప్పుడప్పుడు వచ్చుచుండెడివారు. గురుమూర్తిశాస్త్రులుగారు తెలుగుపాఠములు బోధించుచుండిరి. ఈయన వయోవృద్ధులు. వీరిమాట విద్యార్థులెవ్వరును లక్ష్యపెట్టుటలేదు. ఎప్పుడును క్లాసులో అల్లరి మిక్కుటముగా నుండెడిది. రంగయ్యచెట్టిగారు తనిఖీకివచ్చుసందడి తెలియగనే అందరు నిశ్శబ్దముగ నుండెడివారు. శాస్త్రిగారు ఏవేవో కధలుచెప్పి అందరిని నవ్వించుచుండిరి. ఒకనాడు 'మారన్' మాక్లాసుకు రాలేదు. క్లాసులో అల్లరి ఎక్కువగా నడచుచున్నసమయమున రంగయ్యచెట్టిగారు వచ్చిరి. వీరి దేహచ్ఛాయ నల్లగానున్నను సుందరరూపులు. తెల్లనిధోవతిగట్టి తెల్లనిలాంగుకోటు తొడిగి, సరిగంచుతలగుడ్డ పెట్టుకొని కాళ్లకు తిరుచునాపల్లిముచ్చలజోడు తొడుగుకొని ఏమియు చప్పుడుచేయకుండ నడచుచుండువాడు. ఈయన దుస్తు లేనాటి కానాడు ఇస్త్రీచేసిన మడతలే. వైష్ణవ నామములు దిద్దినముఖము, వంకరలుతీరిన నల్లనిమీసము ఆయన యాకృతికొకరీతి సొంపును గంభీరతను నొడగూర్చుచుండెను. ఈయన క్లాసునకు వచ్చి నేడు మీ పాఠ మేమి యని యడిగి, కుర్చీలో కూర్చుండి పాఠము చెప్పబోవుచుండగా బైనామినల్ థీరం చెప్పవలసినదని విద్యార్థులు కోరిరి. అంతట ఆ థీయరీని చాల నెమ్మదిగ అందరికిని సులభముగ తెలియునట్లు బోధించెను. అంతకుముందు అగమ్యగోచరముగనున్న ఆథీరము అరటిపండు