ఆరాయి దొరగారికి అందించుమని చెప్పెను. ఇంతలో మెట్కాఫ్ గారు"రాయితెమ్మని నిన్నుకోరినానుగాని నీబంట్రౌతును కోరలేదు. నీకు అది చేయుట అగౌరవముగ తోచినదా" యని చెప్పుచు తాను స్వయముగనే ఆరాతిని తెచ్చుకొనెనట. అంతట తహశీలుదారు సిగ్గుపడి క్షమాపణగోరెను.
కాలుచేతులతో పనిచేయుట తప్పుగాదని యిట్లు ఆయన బోధించెను. కాయకష్టముచేయువారు తక్కువవారనియు విద్యలు సంపాదించి యుద్యోగముచేయువా రెక్కువవారనియు నేటికిని మనదేశమున తలంచుచుండుట శోచనీయము.
ఆకాలములో వస్తువులు అగ్గువగను డబ్బు అరుదుగ నుండుటచేత పూటకూలిబసలలో భోజనము పూటకు మూడణాలకంటెను తక్కువగ నుండెను. రాజమహేంద్రవరములో నేనును హనుమంతురావును కళాశాలకు సమీపముననే నొకపూట కూలిఅమ్మవారియింట నెలకు రు 7 ల చొప్పున మూడుపూటల భోజనమున్ను వారవారమును తలంటకును ఏర్పాటుచేసుకొని మరియొకయింటిలో అద్దెకు గదితీసుకొని చదువుకొనుచుంటిమి. కళాశాలలోని ఉపాధ్యాయులలో సుందరరావుగారు ఆంగ్లమును, నాగోజీరావుగారు గణితమును బోధించుచుండిరి. వీ రిరువురును ఎఫ్. ఏ. సీనియర్, బి. ఏ., తరగతుల కే చదువుచెప్పుచుండెడీవారు. కాన మాకు వారితో బరిచయములేకుండెను. శ్రీ కందుకూరి వీరేశలింగముపంతులుగారు ఆంధ్రపండితులుగా నుండిరి. కాని వారైనను మాతరగతి కేపారమును చెప్పుటలేదు గాన మాకు