పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కష్టములోనున్నవారి కెట్లో రహస్యముగ కొలది సాయము చేయుచునేయుండెను. కాని ఆమె యకాలమరణమువలన అప్పుడప్పుడే కూడబారుచున్న కాపురము ఒక్కసారిగ కూలినట్లుండెను. ఆమె చనిపోవునాటికి మా మేనత్తగారు మాయింటిలోనే యుండెనుగాని కొలదిమాసములకే మా తండ్రిగారితో కలహించి ఆమె అత్తవారింటిలో సవతికొమారునియొద్దకు వెడలిపోయెను. అందువలన ఇంటిలో ఆదదిక్కు కరవాయెను. మాతండ్రి విశేష ధనవంతుడు గాకపోవుటచేతను ఎవరియందును విశ్వాసములేక పోవుటచేతను ఇంటిపనులకు మరెవ్వరిని ఏర్పాటుచేయలేదు. తాను ఇల్లు కనిపెట్టుకొనియుండువాడు కానందునను, మేము ఏమియు తెలియని చిన్నవాండ్రమగుటచేతను ఇంటి నొక పరాయివంట మనిషిపై వదలిపెట్టుటకు సాహసించలేకపోయెను. అందువలన ఇంటిపనులన్నియు తనమెడను వేసుకొని ఈదవలసివచ్చెను. నౌకరీ వదలివేయుటకు తగిన ఆర్థికస్తోమత లేనివాడగుటచేత ముందు కాపురముగడచుట కష్టముగావచ్చునను భయముకూడ ఆయన నావహించెను. ఆయన కప్పటికి నలుబదియేండ్లు. మరల వివాహముచేసుకొనుటకు తగిన యవకాశము లుండెను. కాన ఇతరుల ప్రేరణచేత అందుకు కొంత ప్రయత్నముచేసెను. గట్టిగ పట్టుపట్టినయెడల వివాహము సమకూడియేయుండునుగాని, ముగ్గురము మగపిల్లలము చెడిపోవుదు మని యోచించి, వివాహ యత్నము మానివేసెను. అప్పటినుండియు ధృడవ్రతుడై బ్రహ్మ చర్యమునే నడుపసాగెను.

గుమాస్తానౌకరీచేయుచు, ఇంటిపనులన్నియు చక్కబెట్టి మమ్ము అన్నివిధముల సాకుచు మోయరానిమోపు తలపై