పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాబట్టి ఆయూరిలో నొక పాఠశాలకు అద్దె లేకుండగనే ఇచ్చి వేసితిని. అవసరము వచ్చినపుడు ఖాళీచేయుటకు పాఠశాలకమిటీ అంగీకరించెను.

5, 6 నెల్లూరు - నంద్యాల (ఆంధ్రమహాసభలు)

1916 లో నెల్లూరులో ఆంధ్రమహాసభ సమావేశమగుట కేర్పాట్లు జరిగెను. స్థాయీసంఘము నన్నే ఆసభకు అధ్యక్షుడుగానుండునట్లు నిర్ణయించిరి. శ్రీ వంగోలు వెంకటరంగయ్యగారు సన్మాన సంఘాధ్యక్షులుగా నుండిరి. నెల్లూరిలో వీరు న్యాయవాదిగానుండిరి. మిక్కిలి సౌమ్యస్వభావులు. ఆంధ్రభాషయందు అభిరుచికలవారు. ఆంధ్రరాష్ట్రనిర్మాణవిషయమున పూర్ణమగు అభిమానముకలవారు. శ్రీ ఆమంచర్ల సుబ్బుకృష్ణరావుగారు శాసనసభాసభ్యులు. వీ రచట పబ్లిక్‌ప్రాసిక్యూటరుగాను మునిసిపల్ ఛైర్‌మన్‌గా నుండిరి. వీరును మరికొందరును ఆంధ్రరాష్ట్రనిర్మాణమునకు వ్యతిరేకులు. వారు బాహాటముగ నెదిరింపకున్నను ఆంధ్రరాష్ట్రతీర్మానము ఆసభలో నెగ్గు విషయములో కొంత సంశయమేర్పడెను. శ్రీ సుబ్బుకృష్ణరావుగారికితోడు శ్రీ చంగయ్యగా రను మరియొక ప్లీడరుగారుకూడ ఆంధ్రరాష్ట్రనిర్మాణమునుగూర్చి వ్యతిరేకాభిప్రాయము కలిగి యుండిరి. మహాసభకు వచ్చిన ప్రతినిధులు ఉదయమున పినాకిని నదిలో స్నానముచేసి తిక్కనసోమయాజులవారి ఘంటమును చలువచప్పరములో నుంచి, జాతీయగీతములుపాడుచు నూరేగించిరి. నెల్లూరుసమీపమున పాటూరుగ్రామములో ఆయనసంతతివారు ఆఘంటమును దేవతార్చనలో నుంచి ప్రతిదినము