పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వీరు అనుకూలముగనుండుట గొప్పవిషయమని అందర మనుకొంటిమి. తీర్మానము సర్వజనాంగీకారమునుబడసెను.

మరునాడు రామచంద్రరావుపంతులుగారితో ప్రయాణముచేసి మధ్యాహ్నము ఏలూరు చేరితిమి. నా సామానులలో చర్మముతోచేసిన పెద్దసంచి యొకటి కనుపడలేదు. ఆంధ్రనిధి నిమిత్తము వసూలుపరచిన సుమారు నూరురూపాయలమొత్తముకూడా అందేకలదు. రైలునుండి సామాన్లుదించుటలో కూలీలు దానిని వదలివేసిరి. నే నప్పుడు గమనించకపోవుట నాదియే గొప్పలోప మయ్యెను. అప్పుడు స్టేషనుమాస్టరుద్వారా పైస్టేషనునకు తంతివార్త నంపి మరల సంచి వచ్చువరకు ఏలూరులోనే యుండి, పిమ్మట బయలుదేరి యింటికి చేరితిని. మరియొకతూరి రైలుబండి దిగునప్పుడు మంచి విలువగల శాలువతో గూడ పక్కచుట్టను పోగొట్టుకొంటిని. పిమ్మటికాలములో గాంధిగారితో సంచారముచేయునప్పుడు వారు తమసామానంతయు వచ్చినదో లేదో బండినుండి దిగునప్పుడే పరీక్షించుచుండుట చూచి, వారి జాగరూకతకు ఆశ్చర్యము చెందుచుంటిని. ఒకబసలో దిగి, అక్కడనుండి పయనమై కారు ఎక్కినపిమ్మట తమసామా నంతయు ఎక్కించినారో లేదోయని గాంధీజీ పరీక్షించుచుండిరి. ఒకపరి విసనకర్ర బసలో వదలిపెట్టబడెను. దానిని తెప్పించుకొనినపిమ్మటనే వారు పయనముసాగించిరి. ఇంకొకచోట వారు చేతబట్టుకొను వెదురుకఱ్ఱ కనపడనందుకు చింతించిరి. వస్తువు పోయెనని కాదుగాని అజాగ్రత్తగా నుంటిమను బాధయే వారి కెక్కువగా నుండెను. ఇది మహాపురుషుల యందలి ఒక విశేషము.