పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పోవుచుండెను. నాజీవితవృత్తియు బాగుగనే సాగిపోవుచుండెను. అవకాశము కలిగినపుడెల్ల ఆంధ్రోద్యమప్రచారము చేయుచుంటిని.

శ్రీ గోపాలకృష్ణ గోక్లేగారు స్థాపించిన అఖిలభారత సేవాసంఘమువంటి దొకటి ఆంధ్రరాష్ట్రసేవాసంఘమును స్థాపించుట యుక్తమని తలంచితిని. ఆవిషయమై పత్రికలలో ప్రకటించితిని. కొందరు సేవకులమని చెప్పుకొనుట మన పౌరుషమునకు తగియుండదని ఆక్షేపించిరి. కాని ఏపేరుతోనైనను అట్టిసంఘమునుగూర్చి తోడ్పడినవారు లేరైరి. ఆంధ్రనిధిస్థాపింప యత్నించితిని. దానినిమిత్తము జిల్లాలు చాలవరకు తిరిగితిని. అందును గూర్చియు తెగువ కనపడలేదు. రెండువేలరూపాయలు మాత్రము సమకూర్చి గుంటూరుజిల్లా సహకారబ్యాంకులో నిల్వజేసితిని. ఈనిధిని వృద్ధిపరచుటకు కొందరు జమీందారులయొద్దకు పోయెదమని శ్రీ మోచర్ల రామచంద్రరావుగారు చెప్పుచువచ్చిరిగాని అది కార్యరూపమెత్తలేదు. ఆకాలములో వారికి పలుకుబడి హెచ్చుగానుండెనుగాన వారు వచ్చిన బాగుండునని యెంచి నేను స్వతంత్రించి ప్రయత్నించలేదు.

శ్రీ బయ్యా నరసింహేశ్వరశర్మగారు, మోచర్ల రామచంద్రరావుగారు, భూపతిరాజు వెంకటపతిరాజుగారు, చింతలపాటి నరసింహరాజుగారు ఆకెళ్ళ సూర్యనారాయణపంతులుగారును మనఆంధ్రదేశమున తూర్పుజిల్లాలపక్షమున శాసనసభసభ్యులుగా ప్రాముఖ్యమువహించియుండిరి. వీరందరిలో ఆకెళ్ళవారు చాల ధనవంతులు. ఆకాలమున మనఆంధ్రదేశమునుగూర్చి భారతదేశ