పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాంగ్రెసుమహాసభకు గౌరవకార్యదర్శిగ చిరకాలము పనిచేసిరి. శ్రీ కేశవపిళ్ళెగారు గుత్తిలో న్యాయవాదిగానున్నను మిక్కిలి పలుకుబడి సంపాదించి శాసనసభలో సభ్యత్వముబడసి, రాయలసీమలో ప్రాధాన్యము వహించియుందిరి. మోచర్ల రామచంద్రరావుగారు చెన్నపురి శాసనసభలో ప్రఖ్యాతి వహించినారు. ప్రభుత్వమువారిచే మన్ననబడసినవారు. అప్పటికాలములో ఆంధ్రదేశమున ఈమువ్వురిని మించినవారు రాజకీయములలో లేరు కావున వారిఅభిప్రాయమును ముందే తొలగత్రోసినచో ఆంధ్రోద్యమమునకే విఘాతము సంభవించుననుట స్పష్టమే. దేశమున ఈవిషయమున చీలికలు బలమగును. ముట్నూరి ఆదినారాయణయ్యగారు ఆంధ్రరాష్ట్రతీర్మానమును ప్రతిఘటించుచు దీర్ఘముగ నుపన్యసించిరి. వారు చేసిన ఆక్షేపణలలో ముఖ్యమైనదేమన ఆంధ్రమహాసభోద్దేశములలో ఆంధ్రరాష్ట్ర విషయము లేదనియు ఆంధ్రుల పురోభివృద్ధియే సామాన్యముగ వక్కాణించియుండుటచే తమవంటివారు సభలో పాల్గొనుట సంభవించెననియు, ముందు తెలుపకయే ఈతీర్మానము ప్రవేశపెట్టుట క్రమముగాదనియు వాదించిరి. రామచంద్రరావుపంతులు మొదలగువారు అమోఘమగు దేశసేవయొనర్చినవారగుటవలన వారి సమ్మతిగూడ సమకూర్చుకొనుట అవసరమని కూడ నయవచనములతో ప్రసంగించిరి. ప్రజాభిప్రాయము తెలుసుకొనకయే యిట్టి తీర్మానము చర్చించుట అసమంజసమని ఆక్షేపించిరి. తొలుతనే భేదాభిప్రాయములు చెలరేగుట వలన అపుడపుడే మొలకెత్తిన ఆంధ్రోద్యమము మాసిపోవునేమోయని మిక్కిలి భీతినొందితిని. కావున వాదోపవాదములు