పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రాహ్మణుల తోటివారే గాని పాండిత్య గరిమ గలవారెవ్వరును లేరు. మా కొండవారి కుటుంబమునకు ముప్పది యకరముల యీనాముభూమి యుండెను. మా తాతగారైన అప్పయ్య గారికి చిన్నతనములోనే తల్లి చనిపోయినందున ఆయన తండ్రి గోవిందరాజులుగారు మరల వివాహము చేసుకొనిరి. ఆ రెండవ భార్యకు చినఅప్పయ్య అను నొక కుమారుడును, ఆయనకు కుమాళ్ళు, కుమార్తెలు నుండిరి.

మా తాత అప్పయ్యగారు వాసిరెడ్డివారి జమీనుకు ప్రధాన స్థానముగానున్న అమరావతిలో నేదియో యుద్యోగము చేయుచు అక్కడనే చాలకాలము కాపురముచేసి ఉద్యోగము మాని గుంటూరు తిరుగవచ్చునప్పటికి ఈనాముభూములును, కుటుంబపు ఇల్లును సవతి సోదరుని కుటుంబమువారు అనుభవించుచుండిరి. ఎట్లో కొంత ప్రయత్నముమీద ఈనాము భూమి ముప్పది యకరములలో మా తాతగారి సగభాగము విడగొట్టి, ఆయనకు స్వాధీనపరచి, కుటుంబపు ఇంటి ఆవరణ స్థలంలో చాలవరకు సవతిసోదరుల కుటుంబము క్రిందనే యుంచుకొని, తూర్పుమూల మూడువందల గజముల ఖాళీస్థలములో నున్న యొంటి దూలపు పాత పెంకుటిల్లు మా తాతగారికి నిచ్చి యుండిరి. ఆ యింటిలో కాపురముచేయుచు తన భాగమునకు వచ్చిన పదునైదు యెకరముల భూమిని నొక జీతగానిని పెట్టుకొని వ్యవసాయము చేయించుకొని దానివలన వచ్చెడి ఆదాయముతో నెట్లో కాలము గడుపుచు పెద్దకాలము జీవించి లోకమును విడిచిపోయిరి. ఆ తుదిదినము ఉదయముననే లేచి