సమాధానముచెందెను. మునిసిపల్ వ్యవహారములు మామూలుగ నడచిపోయెను. ఛైర్మన్ వెంకటరెడ్డిగారు చాలకాలము రోగపీడితులుగా నుండి చనిపోయిరి. ఇట్లు ఖాళీపడిన ఛైర్మన్ పదవికి నేను నిలువవలెనను కోర్కె జనించెను, గాని హనుమంతరావుగారికి ఆపదవియెడల విశేషవ్యామోహము కలిగియుండుటచే నేను నాకోర్కెను విడనాడి, ఆయన యుండుటయే యుక్తమని తలంచితిని. తుదకు "పొగాకునాయుడుగా" రని పేరుపొందిన యతిరాజులునాయుడుగారు ఛైర్మన్గా అధికసంఖ్యాకులచే నెన్నుకొనబడిరి. ఆకాలములోనే శ్రీ. ఎస్. శ్రీనివాస శాస్త్రిగారు గుంటూరువచ్చిరి. వీరు తర్వాత (Servants of india society) అఖిలభారత సేవాసంఘమునకు అధ్యక్షులై గొప్ప గౌరవము బడసి, సర్, రైటి ఆనరబిల్ బిరుదములు బడసిరి. వీరు తిరువళ్ళిక్కేణిహైస్కూలులో ప్రధానోపాధ్యాయులుగా నున్నకాలములో శ్రీ గోపాలకృష్ణ గోక్లేగారు వీరి ఆంగ్లేయభాషాపాండిత్యమును లోకవిషయపరిజ్ఞానమును, అసమానమగు వక్తృత్వశక్తిని గమనించి తాము స్థాపించిన అఖిలభారత సేవాసంఘములో సభ్యులుగా చేరునట్లు ప్రోత్సాహించిరి. ఆదినములలోనే గుంటూరుకు వచ్చి రెండుమూడు దినములు మాయింటనే అతిధిగా నుండిరి. అప్పుడు వారి గౌరవార్ధ మొక అల్పాహారవిందు నేర్పాటుచేసి న్యాయవాదులలో ప్రముఖులగువారి నందరిని పౌరనాయకులను సమావేశపరచితిని. అప్పుడు శాస్త్రిగారు ఉపన్యాసములో నన్నుగూర్చి ప్రశంసించుచు మునిసిపాలిటీలో నన్ను సభ్యునిగా నెన్నుకొని నాచే సేవచేయించుకొనుట యుక్తమని వక్కాణించిరి. నాకు శాస్త్రి