సమ్మతించక తమ ఆస్తిలో నేను భాగము తీసికొనితీరవలెనని పట్టుపట్టిరి. నేను స్వార్జితముగా సంపాదించిన సొమ్ముగూడ ఆస్తి మొత్తములో చేర్చి యావదాస్తియు మూడు భాగములుగా పంచవచ్చునని సీతారామయ్యగారిచే నాకు తమ అభిప్రాయము తెలిపిరి. అందుకు నేను సమ్మతించితిని. వన్లైఫు ఇన్సూరెన్సు కంపెనీవలన నాకు రెండుసంవత్సరములలో రానున్న రు 3000/- లును, ఏలూరు జ్యూట్మిల్లులో భాగములు వెల రు 1000/- లును, మరి యితరబాపతులు కలసి నాయాస్తి రు 6000/- ల మొత్తముతేలెను. ఆమొత్తముతో యావదాస్తి రు 30000/- లుగా నిర్ధారణచేసిరి. ఒక్కొక్కరికి రు 10000/- ల చొప్పున భాగనిర్ణయము గావించిరి. ఇందు కుటుంబముతాలూకు ఇల్లు నాభాగమునకే చేర్చిరి. ఇంటియావరణమునకు తూర్పువైపున నున్న ఖాళీస్థలమును అందున్న పంచపాళీయు నా పెదతమ్ముని కిచ్చిరి. నాచినతమ్మునకు ఒక ఖాళీస్థలమును, ఇంటిక్రింద కొంతసొమ్ము నేను ఇచ్చులాగున నిర్ణయముచేసిరి. భూములుమాత్రము ఉత్తమమధ్యమములు నిర్ణయించి పంచిపెట్టిరి. రుణములు వసూలుపఱచి, వచ్చినసొమ్ములో ఎప్పటి దప్పుడు భాగముల వరుస తీసుకొనుచుండులాగున ఏర్పరచి, బాకీలు వసూలుచేయు బాధ్యత నాపై నిలిపిరి. ఇతరగ్రామములలోని భూములు జాయింటుగానే ఉంచుకొని, అయివేజుమాత్రము సమానభాగములుగా ప్రకృతమునకు పంచుకొనులాగున వీలువెంబడి అవియును పంచుకొనునట్లు నిర్ణయించిరి. మాతండ్రిగారు వెయ్యిరూపాయల బాకీ యొక్కటీ వారిక్రిందనే యుంచుకొనిరి. నాభాగమునకు వచ్చినయింటిలో నాచిన్నతమ్ముడు కాపురముండెను. పిమ్మట