ఏటేట సన్మానములుచేయు నాచారము నడుపుచునే యుండిరి. జమీందారుగారి సతీమణి హిందూమతాభిమానిగా నుండి, దేవీపూజలు మొదలగునవి చేయుచుండెను. ఆమె దీపారాధన చేయుచుండగా అకస్మాత్తుగా చీరకు నిప్పంటుకొని మండుటచే దేహమంతయు కాలి మరణించెను. అప్పటినుండి జమీందారుగారి వర్తనలో కొంత మార్పుకలిగినట్లు చెప్పుచుందురు. మూడు నాలుగు సంవత్సరములక్రిందట వారు షష్ఠిపూర్తిఉత్సవము అతివైభవముతో గావించుకొనిరి. అపుడు బ్రహ్మసమాజము వారికిని, ఇతరపండితులు, కవులు, గాయకులు మొదలగువారి కనేకులకు భూరిసన్మానములు గావించిరి. ఆఉత్సవమునకు నేను వెళ్ళొ వారొనర్చిన పరోపకారకార్యములను ప్రశంసించితిని. కడప జిల్లాలో మైదుకూరునకు సమీపమున ఆనందాశ్రమములో చేసిన చిత్రవర్ణదారుశిల్పములు కొన్ని వారికి సన్మానపూర్వకముగ నొసంగితిని. ఈ చిత్రకారులు పనిచేయు ఆశ్రమమునకు విరాళరూపమున సహాయము చేయదగునవి శ్రీ రాజావారి కప్పుడు ముఖ్యసలహాదారులుగ నుండిన శ్రీ బులుసు సాంబమూర్తిగారి మూలకముగ తెలియపరచితిని. పిమ్మట పలుమార్లు జ్ఞాపకము చేసినను ఏమియు నీయలేదు. బ్రహ్మసమాజమును గూర్చిన శాఖాచంక్రమణము నింతట నాపి, మరల స్వదేశోద్యమము నెత్తికొందును. బిపినచంద్రపాలుని యుపన్యాసములచే ఆంధ్రదేశము ఉత్తేజితమైన ఆదినములలో బందరులో శ్రీ డాక్టరు భోగరాజు పట్టాభిసీతారామయ్యగారును, శ్రీ కోపల్లిహనుమంతరావుగారును, శ్రీముట్నూరికృష్ణారావుగారు అను ముగ్గురు యువకులు సార్వజనికములగు ఉపకారకార్యములందు ఉత్సాహము కల