ములు కొన్ని స్థాపించబడెను. ప్రభుత్వమున కిది వెట్టబుట్టించెను. కాని ఇంతమాత్రమున ఈఉద్యమములో నున్నవారి నేమియు చేయలేకుండిరి. తమ క్రిందియుద్యోగులు స్వదేశవస్త్రములు ధరించుట సహింపకుండిరి గాన ఆ ఉద్యోగులు ఈ ఉద్యమమునకు దూరముగనే యుండిరి. జాతీయవిద్యాప్రచారము సాగుచుండెను. జాతీయగీతములు, పద్యములు జనులలో ప్రాకిపోయెను. వందేమాతరగీతము ప్రజలలో నూతనోత్సాహము పురికొల్పుచుండెను. ఆకాలమున బంగాళారాజధాని భారతదేశమునకు మార్గదర్శకమై విలసిల్లుచుండెను. ఆనాటి ఉద్యమముల కన్నిటికి ముఖ్యస్థానము కలకత్తాపట్టణమే. సురేంద్రనాధబెనర్జీ, డబ్లియు. సి. బెనర్జి, బిపిన్చంద్రపాల్ మొదలగు కాంగ్రెసునాయకులు వక్తృత్వమున సుప్రసిద్ధులు. వీరిలో బిపినచంద్రపాల్ కలకత్తామొదలు చెన్నపట్టణమువరకును గల పట్టణము లన్నిట స్వదేశోద్యమమునుగురించి మహోద్రేకపూరితములై, యువకుల వేడిరక్తము పొంగులెత్తించు గంభీరోపన్యాసముల నిచ్చి ఎన్నడు కనివినని ప్రజాందోళన గల్పించెను.
బిపినచంద్రపాలు బ్రాహ్మసామాజికుడు. సమాజసందేశ వ్యాప్తికై అంతకుముందొకసారి బందరుకు వచ్చి, మహోపన్యాసమొసంగెను. ఆనాడు బంగాళదేశమున ఆంగ్లేయవిద్యాధికులు పలువురు బ్రాహ్మసమాజికులే. వీరిలో అనేకులు విద్యావతులగు స్త్రీలుగూడ చేరియుండిరి. ఏ కేశ్వరోపాసనము, జాతి కులభేదములులేని సర్వమానవసమానత్వము, విగ్రహారాధననిషేధమును - ఈమతము హైందవమతమునుండి వేరుజేయువిశిష్టాంశ