గుంటూరు నివాసము
అప్పటికి గుంటూరులో నాకు ముఖ్యస్నేహితుడు న్యాపతి హనుమంతరావు అగ్రహారములో కోపల్లెవారి మేడను ముందుగనే కుదిర్చియుంచినందున సామాను లన్నియు నచ్చట చేర్చి, పాతగుంటూరులో మానాయనగారును తమ్ములు నివసించుచున్న పురాతనగృహమునకు చేరితిమి. అచ్చట నొకటి రెండు రోజు లుండి, అగ్రహారములో కాపురముచేయ ప్రారంభించితిమి. గుంటూరులో జిల్లాకోర్టు 1905 సంవత్సరము ఆగష్టులో ప్రారంభింపబడెను. నేను గుంటూరు చేరునప్పటికి పబ్లిక్ ప్రాసిక్యూటరుపని శ్రీ కామరాజు మన్నరుకృష్ణరావుగారికిచ్చివేయబడెను. నేను ఆపనినిమిత్తము వచ్చెదనని నిరీక్షించినట్లును నేను రానందున, మరియొకరి కీయవలసివచ్చినట్టును జిల్లాకోర్టుసిరస్తాదారు నాతో చెప్పిరి. అచటి జడ్జి పర్సీవల్ రైస్. వీరు బందరు జిల్లాకోర్టుజడ్జిగాకూడ నుండిరి. వారును నేను వచ్చెదనేమో యని యోచనచేసియుండవచ్చును. శ్రీమన్నారు కృష్ణరావుగారు ఫస్టుగ్రేడుప్లీడరైనను వంగోలుమునసబుకోర్టులో న్యాయవాదిగా పనిచేయుచు అక్కడ మునిసిపల్ ఛైరుమన్గా నుండి ప్రాముఖ్యమువహించెను. వంగోలులో పశువులసంత నేటేట జరుపుచు జిల్లాకలెక్టరులు, బోర్డుమెంబర్లు, గవర్నమెంటు సెక్రటరీలు మొదలగువారి ప్రాపకము సంపాదించెను. వారే చాలకాలము పబ్లికుప్రాసిక్యూటరుగ నుండి దివానుబహద్దరుబిరుదమును సంపాదించి గవర్నమెంటుపక్షపాతి అనిపించుకొనిరి. కాని అసహయోద్యమకాలములో మేము బాధలు పొందుచుండు