ఆయనకు నన్నుగూర్చిన అనుభవము ఉన్నదున్నట్లు వ్రాయవచ్చును గనుక యోగ్యతాపత్రము కోరుటయే యుక్తమని తలంచితిని. జడ్జిగారు మరునాడు ఉదయము తన బంగాళాకు రావలసినదని చెప్పిరి. బెజవాడకు కాలువమీద పోవుటకు పడవ నొకదాని నేర్పాటుచేసుకొని నా సామానులు భద్రముగ నెక్కించుట కేర్పాటులు చేసుకొని నామిత్రుడు హనుమంతరావు వద్దను, సోదరన్యాయవాదులవద్దను సెలవుపుచ్చుకొంటిని. శ్రీ జంధ్యాలగౌరినాధశాస్త్రిగారు తమగుంటూరుజిల్లా కక్షిదారుల రికార్డును నాకు దయతో నిచ్చివేసి, పార్టీలకుగూడ ఉత్తరములు వ్రాసి, నాకు వకాల్తనామా వారిచే నిప్పించిరి. తమ కెదురు పక్షముననుండి వాదించినకేసులలో నేను తృప్తికరముగ పనిచేసి యుంటిననియు, సాక్ష్యమును క్రాసుప్రశ్నలు వేయుటలో హనుమంతరావుకంటె నిపుణత్వము జూపితిననియు, గుంటూరులో త్వరలో వృద్ధికిరాగలననియు పలికి నన్ను ఉత్సాహవచనములతో బహూకరించి వీడ్కొలిపెను. శ్రీ పురాణము వెంకటప్పయ్య పంతులుగారు అక్కడి న్యాయవాదులలో మిక్కిలి పేరుపొందినవారు. ఆయనవద్ద సెలవుగైకొనబోగా "మీయొద్ద స్వతంత్ర కార్యాచరణశక్తియు, ధైర్యమును, ఉత్సాహము నున్నవి. కాన ముందుకాలమందు పేరుప్రతిష్ఠ లెక్కువగా పొందగల"రని నన్ను దీవించి తమయొద్ద నున్న గుంటూరుకక్షిదారుల అప్పీళ్ళు రికార్డులు నొకటిరెందు నా కిచ్చిపంపిరి. మునసబుకోర్టుప్లీడర్లలో నాకు బ్రియమిత్రులు సాధువర్తనులును, సత్యప్రియులు నగు శ్రీ కట్టమూడి చిదంబరరావుపంతులుగారిని వదలివచ్చుట కష్టముగనుండెను. స్నేహపాత్రులైన కొండూరి లక్ష్మీనారా