పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వందలరూపాయలవరకు బెరిగెను. మసీదుబురుజులమీద సహితము స్థానము లేర్పరచి కొన్నివందలరూపాయలు వసూలుచేసిరి. ఇక రాజవీధులప్రక్క ఇండ్లమేడలమీదను, డాబాలమీదను గోడలమీదనుగూడ ప్రేక్షకులు తావులేర్పరచుకొనిరి. నేను మసీదుమెట్లమీద తొమ్మిదిరూపాయలకు టిక్కెట్టు కొంటిని. ఉత్సవము మధ్యాహ్నము పండ్రెండుగంటలకు ఆగ్రాద్వారముగుండ బయలుదేరెను. అందుకు సూచనగ పెద్దఫిరంగులమ్రోత వినబడెను. పిమ్మట నశ్వరాజము నెక్కిన భారతీయనాయక ప్రముఖుడొకడు పొడసూపెను. ఈతడు సర్‌ప్రతాపసింగు అని కొందరు ప్రేక్షకులు చెప్పుచుండిరి. ఆయనవెంట గుఱ్ఱములపై బ్యాండువాయిద్యము బయలుదేరెను. వారివెనుక పదాతివర్గము నడువసాగెను. ఆ పదాతుల వెన్నుదన్ని మరియొక బ్యాండు వాయిద్యమును వారి వెన్నంటి అశ్వములపై రాజకుమార దళమును నడువసాగెను. సమానవయస్కులు, సుందరగాత్రులునగు రాకుమారులు తెల్లనిషేర్వాణీలును, లేతనీలవర్ణపుదలపాగలును, రత్నస్థగితములై మెరయుచున్న కల్కితురాయిలు ధరించి మణులుచెక్కిన కంఠహారములతో తేజోవంతములగు ముఖారవిందములతో చూచువారల కన్నులకు ఆనందము గొల్పుచుండిరి. నక్షత్రములు ఆకసమునుండి దిగివచ్చి ఈ మహోత్సవమున పాల్గొనుచున్నవా యన్నట్లు ఇరువదియేడు గురు రాకుమారులు ఆశ్రేణిలో నుండిరి. వీ రెక్కిన గుఱ్ఱములును చిరుతపులిచర్మపుజీనులతో నొక్కరూపున నొప్పారు (Pony) పోనీలు. ఈదళము వెనుక ఆఫ్‌గన్‌పటానుయువకులు వదులుగానుండు తెల్లని చొక్కాలు తొడిగి, తోకలు విడిచిన