పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొఠాయిలో జేరి సభగావించి, అందులో కొందరు ప్రొఫెసర్ లాయిడ్ అవినీతివాక్కులను అందువలన కలిగిన అవమానమును ఖండించుచు ఉపన్యాసము లిచ్చినపిమ్మట ప్రొఫెసర్‌లాయిడ్‌చేసిన దుర్భాషణనుగూర్చి తగినచర్య ఆయనపై చేయువరకును మేము కళాశాలకు రాకుండ సమ్మెకట్టుటకు నిర్ణయించుకొంటిమి అని తీర్మానించి ఆతీర్మానమును కళాశాలాధికారులకు అందచేసితిమి.

అందుపై కళాశాల సిండికేటు సమావేశమై విద్యార్థులిట్టి తిరస్కారభావమును బూనియున్నందున వారి తీరుమానము విచారింపబడదని వ్రాతమూలకముగ మారు తెలియజేసెను. ఇట్లు మాసమ్మె పదిదినములు సాగినది. క్రైస్తవవిద్యార్థులు తప్ప తక్కిన విద్యార్థులెవ్వరును కళాశాలకుగాని హైస్కూలుకుగాని పోలేదు. ప్రతిదినము ఉదయముమొదలు సాయంత్రము చీకటిబడువరకు సభ జరుగుచునేయుండెను. చెన్నపట్టణములోని కొందరు హిందూసంఘపుబెద్దలు సయితము మాసభకు వచ్చి క్రైస్తవకళాశాలవారును మిషనరీలును హిందూమతమును నాశనముచేయగోరుచున్నారనియు వారుచేయు అవమానములు భరింపరానివనియు విద్యార్థులు గావించిన సమ్మె క్రమమైన దనియు మమ్ముప్రోత్సహించుచుండిరి. అప్పుడు చెన్నపట్టణములో ఎఫ్. ఏ. చదువుచున్న శ్రీ వల్లూరు సూర్యనారాయణ రావుగారు ఒకరోజున మాసభకు వచ్చి, మిక్కిలి ఆవేశపూరితులై కళాశాలాధికారులను ప్రొఫెసర్ లాయిడ్‌ను విమర్శించుచు దీర్ఘముగ ఉపన్యసించిరి. హిందూపత్రికా కార్యాలయములోని కొందరు ఉపసంపాదకులును అటులనే ఉపన్యసించుచుండిరి. మద్రాసు మెయిలుపత్రిక క్రైస్తవకళాశాలపై పూర్వమునుండి