ఆమె గుండెలో ఏదో బాధ ప్రవేశించింది. కథానాయిక వేషం వేసింది ఎవరు? ఆమె గుణగణా లెలాంటివి? అని ప్రశ్నలు వేద్దామని, కానీ తన గురువు ఏమనుకుంటాడో అని భయం.
పరీక్షలైపోయాయి. చివర పేపర్లు బాగానే జవాబులు వ్రాసింది. మొదటి పేపర్లలో విశ్వవిద్యాలయానికే మొదటగా వస్తుంది.
అనంతలక్ష్మి కోనంగిని సినీమాలో చేరమని మొదట ప్రోత్సహించింది. అంతకన్న గొప్ప యేమిటని వాదించింది. ఇప్పుడు వద్దని ఏలా చెప్పగలదు. నవ్వులాటగా ఉండదా? తన భవిష్యత్తు ఏలా ఉంటుందో?
ఇంతలో కోనంగి చిత్రంలో, ఒక ఘట్టము తీయడమైన వెనక, అనంతలక్ష్మిని చూడడానికి వచ్చాడు. ఒకరాత్రి, ఒక పగలు ఆ ఘట్టం తీయడం జరిగిందట. ఒక చిన్న ఇంటిలోని రంగము, కథానాయకుడూ, నాయికా చిలకాగోరింకల్లా కబుర్లు చెప్పుకొనడం రంగమూ, అక్కడకు కథానాయకుని తండ్రి పంపిన పెద్దవచ్చి, కథానాయకుని బెదిరించే రంగమూ, కథానాయకుని తల్లి వచ్చే రంగమూ అయ్యాయి. ఇంకా ఆ ఇంటికి సంబంధించిన రంగాలు పద్దెనిమిది వున్నాయట.
తానూ కథానాయికా కలిపి పాడిన పాట ఒకటి అతడు అనంతలక్ష్మికి పాడి వినిపించాడు.
అనంతలక్ష్మి చెవులార ఆ పాట విన్నది. అతడు నాయిక పొడినచరణాలూ వినిపించాడు. ఈ పాట ఇదివరకే తీసి ఇప్పుడు ఆపాట యంత్రం వెనక పాడుతూ వుంటే తాము ఆ పాటతో కలిసి పాడుతూ అభినయించామనీ, ఛాయాగ్రహణ యంత్రం మాత్రం ఆ చిత్రం తీస్తుందనీ, పాడిన పాట తమ పెదవుల నటనతో సరిపోయేటట్టే చిత్రం తీస్తారనీ అతడు తెలిపాడు.
అనంతలక్ష్మి కొంచెం విపులం చేసి చెప్పమంది.
కోనంగి: ముందర మేము ఇద్దరం పాడిన పాట విను.
‘21వ మేళం-మదగజగమనరాగం-త్రిశ్రజాతి రూపకం.
నాయకుడు: | బంగారు పీటపై | |
నాయిక: | పువ్వల్ల పూజలో | |
నాయికుడు: | పరభృత స్వనకంఠి | |