పుట:Konangi by Adavi Bapiraju.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4

కోనంగికి రాజకీయాలేమీ లేవు కాబట్టే, వ్యవసాయానికి సిద్దంగావున్న శాలి భూమిలా ఉన్నాడు.

“మదర్ ఇండియా” అతనిని రాజకీయపు నిద్రమత్తు నుండి లేపింది. “ఏమిటీ కాంగ్రెసు? ఎవరీ మహాత్ముడు? ఎందుకీ అహింస? ఏలాంటిదీ సత్యాగ్రహం?” అని ప్రశ్నలు వేసుకున్నాడు. కాంగ్రెసును వ్యతిరేకించే జస్టిస్ పార్టీ అంటే ఏమిటి?

అతడు ఈ పేర్లు వినలేదనిగాని, వీటి అన్నిటి" విషయమూ చూచాయగా తెలియదనికాని కాదు. ఈలాంటి వివిధ భావాలు, సకల ప్రపంచ పథకంలో పెట్టుకొని ఇంతవర కాతడు పరీక్షకు చదివినట్లు చదవలేదు.

అనంతలక్ష్మి ఇంట్లో వేలకొలది పుస్తకాలున్నాయి. పట్టాభిగారి “కాంగ్రెసు చరిత్ర” ఉంది. మహాత్ముని “యంగ్ ఇండియా” పత్రికా సంపుటాలూ, “హరిజన” సంపుటాలూ ఉన్నాయి. అహింస, సత్యాగ్రహం వీనిమీద వ్రాసిన గ్రంథాలున్నాయి. రొమైన్ రోలా మొదలగువారు గాంధీ మీద వ్రాసిన గ్రంథాలున్నాయి. ఈ సంవత్సరమే గాంధీగారిమీద డెబ్బదవ సంవత్సరోత్సవ సంచిక రాధాకృష్ణునుగారు ప్రచురించిన గ్రంథమున్నది. గాంధీగారు వ్రాసిన “హింద్ స్వరాజ్”, “సత్యం విషయమై నా పరిశోధన” అనే గ్రంథా లున్నాయి. వారు భగవద్గీతకు వ్రాసిన భాష్యమున్నది.

తిలక్ గారి భగవద్గీతా భాష్యమున్నది. నటేశన్ కంపెనీవారు ప్రచురించిన ఇతర గ్రంథాలెన్నో ఉన్నాయి. లాలా లజపతిరాయిగారు వ్రాసిన గ్రంథ మున్నది. జవహర్ లాల్ గారి “ప్రపంచ చరిత్ర”, “జీవిత చరిత్ర” అనే గ్రంథాలున్నాయి.

ముస్లింలీగువారి వ్రాతలు, జస్టిస్ పార్టీ వారి వ్రాతలు, గోఖలేగారి ఉపన్యాసాలు మొదలయినవి చదవడం ప్రారంభించాడు. నౌరోజి, పాల్, రెనడీ, మెహతా, బెనర్జీ, బాసు మొదలైనవారి జీవిత చరిత్రలు, ఉపన్యాసాలు చదవడం సాగించాడు.

అనంతలక్ష్మి పరీక్షలకు వెళ్ళేరోజులు వచ్చేసరికి 1940 మార్చి నెలకు ఈ గ్రంథాలన్నీ పూర్తి చేశాడు.

ఇవి చదువుతూ 1939 డిశంబరు నుండీ ఉద్యోగంకోసం వెదుకుతూ, 1940 జనవరిలో ఒక తెలుగు సినిమా కంపెనీలో కథానాయకుడుగా చేరాడు.

నెలకు రెండు వందల జీతము. భోజనము కంపెనీవారి భోజనసత్రంలోనే!

బొమ్మ తీయడం ప్రారంభించడం మార్చి నెలనుంచి అనీ, కోనంగి ఆ కంపెనీవారి భవనంలో ఉంటూ తన కిచ్చిన నాయకుని భాగం యావత్తూ కంఠత చదివేయాలనీ, అతని వంతుకు వచ్చిన అయిదు పాటలూ రోజూ రిహార్సల్సులో క్షుణ్ణంగా వచ్చేయాలనీ మేనేజింగు డైరెక్టరు విష్ణుమోహన లక్ష్మీనారాయణగారు చెప్పినారు.

పోరనూ, పాటలూ మూడు రోజులలో కంఠతః పట్టినాడు. రోజూ రిహార్సల్సు ఉదయం పదకొండు గంటలు మొదలు, సాయంకాలం ఆరుగంటల వరకూ.

కోనంగి సినీమాలకు ఒక మోస్తరుగా వెళ్ళేవాడు. ఇప్పుడు దాని సంగతి బాగా తెలుసుకోవాలని "సినీమా టెక్నిక్”, “మంచి నటన”, “ధ్వని” “కెమెరా” “ దర్శకత్వం” అను గ్రంధాలు, ఇంకా ఎన్నో గ్రంథాలూ అన్నీ క్షుణ్ణంగా చదివేవాడు.

సినీమాలో అతనికి ప్రవేశం దొరకడానికి కారకుడు డాక్టరు రెడ్డిగారే!